ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నుంచి సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్(పరిశ్రమలు, ఐటీ మంత్రి).. సహా అధికారులు వెళ్లనున్నారు. అయితే.. ఈ సారి పూర్తిగా పెట్టుబడుల ఆకర్షనపైనే చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీలు నిర్వహించనున్నారు. ‘బ్రాండ్ ఏపీ’ ప్రమోషన్తో పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు సీఎం చంద్రబాబు బృందం సింగపూర్లో పర్యటించనుంది.
దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలుత దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు వందల కోట్ల పెట్టు బడులు తెచ్చినట్టు తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు రెండో ఏడాదిలోకి ప్రవేశించిన ప్రారంభంలోనే విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ప్రయత్నిస్తారు. నూతన పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్, వంటివి వివరించి.. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించనున్నారు.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, సుదీర్ఘ తీర ప్రాంతం, నిపుణు లైన మానవ వనరులు ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావాలని సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు బృందం వివరించనుంది. మొత్తం 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం.. రోడ్ షో నిర్వహించి.. పెట్టుబడి దారులను ఆకర్షించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సిఎం పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates