రఘునందన్ రావు.. పాత కేసు మళ్లీ వార్తల్లోకి

దుబ్బాక ఎన్నికల్లో సంచలన విజయం సాధించి జాతీయ స్థాయిలో వార్తల్లో వ్యక్తిగా మారాడు రఘునందన్ రావు. ఒకప్పుడు న్యాయవాది అయిన రఘునందన్.. టీవీ చర్చల్లో బీజేపీ ప్రతినిధిగా వెలుగులోకి వచ్చారు. మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. ఐతే కొన్నేళ్ల కిందట ఆయన ఓ రేప్ కేసు ఆయన్ని వివాదంలోకి నెట్టింది.

రాజా రమణి అనే మహిళ.. తనపై రఘునందన్ అత్యాచారం చేసినట్లు సంచలన ఆరోపణలు చేసింది. ఐతే ఈ కేసు ఎటూ తేలకుండా పోయింది. ఏడాదిగా ఈ వ్యవహారం వార్తల్లోనే లేదు. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ఆ కేసు వార్తల్లోకి వచ్చింది. అందుక్కారణం రాజా రమణి తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటమే.

తనపై రఘునందన్ అత్యాచారం చేసిన కేసుకు సంబంధించి కొన్నేళ్లుగా పోరాడుతున్నా తనకు న్యాయం జరగలేదని, ఎవరూ స్పందించడం లేదని సెల్ఫీ వీడియోలో రాజా రమణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఈ కేసులో న్యాయం జరక్కపోగా.. రఘునందన్‌తో పాటు పోలీసులు తనను వేధిస్తున్నారని.. దీంతో విరక్తి చెంది తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పి ఆమె నిద్ర మాత్రలు మింగారు.

తనను వేధింపులకు గురి చేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్, ఆర్సీపురం పోలీసులపై చర్యలు చేపట్టాలని రాజా రమణి డిమాండ్ చేశారు. రాజా రమణి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలుసుకున్న ఆమెను ఆర్సీపురం పోలీసులు పటాన్ చెరులోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. ఆమె కోలుకుని ఇంటికి చేరినట్లు తెలుస్తోంది.