పార్లమెంటు వర్షాకాల సమావేశాలు..సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు మద్దతు ఇస్తున్న టీడీపీ.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. సహా ఇతర పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేవారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పైపార్లమెంటులో చర్చకు పెట్టాలని సూచించారు.
అలాగే.. 9 ప్రధాన అంశాలతో కూడిన అజెండాను ఎంపీలకు అందించారు. పార్లమెంటు సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టు సహా.. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం ప్రాజెక్టులపై చర్చించి.. నిధులు తెచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వచ్చేలాకేంద్ర సహకారాన్ని కూడా.. పార్లమెంటు సమావేశాల్లోనే రాబట్టాలని తెలిపారు. అలాగే.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని.. ఈ విషయాన్ని పార్లమెంటు వేదికగా చర్చిస్తే.. దేశవ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని.. ఆ బాధ్యతలను పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు చూడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో మహిళా నేతలపై వైసీపీ నాయకులు అసభ్య ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయాన్ని కూడా పార్లమెంటులో చర్చకు పెట్టి వైసీపీని ఎండగట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి అభివృద్ధికి చర్యలు, మామిడిరైతులపై పార్లమెంటులో చర్చ పెట్టడం ద్వారా సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పా రు. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు రాబట్టేలా.. ఎంపీలు వ్యవహరించాలన్నారు. కేంద్ర ప్రవేశ పెట్టిన… కొత్తగా తీసుకువస్తున్న కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని.. వాటిని కూడా ప్రస్తావించి.. కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా ప్రయత్నించాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates