విపరీతమైన పోటీలో సంక్రాంతి పండక్కు విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి అద్భుతాలు చేయకపోయినా గత రవితేజ డిజాస్టర్లతో పోలిస్తే బెటరనే స్పందన, వసూళ్లు తెచ్చుకుంది. రాజా సాబ్ ని పక్కనపెట్టి ర్యాంకింగ్ వేసుకుంటే మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. దీన్ని బట్టి ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
సరే రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఒక్క విషయంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి రోల్ మోడల్ గా నిలుస్తోంది. అతి ఆలస్యంగా 59 రోజుల తర్వాత మార్చి 13 నుంచి ఓటిటి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటిదాకా డిజిటల్ లో రాకపోవడం ఆశ్చర్యమే. ఇంత లేట్ వెనుక కారణం నిర్మాణ సంస్థ ఒప్పందం కాదని ఇన్ సైడ్ టాక్. వేర్వేరు రీజన్స్ వల్ల ఓటిటి వైపు నుంచే జాప్యం జరిగిందని అంటున్నారు.
అసలే ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. టాలీవుడ్ సినిమాలు ఏవైనా థియేటర్, ఓటిటి మధ్య కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే ప్రతిపాదన మీద నిర్మాతల మండలి సీరియస్ గా విశ్లేషణ చేస్తోంది. సాధ్యాసాధ్యాల గురించి డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇలా చేయడం వల్ల చిన్న నిర్మాతలు నష్టపోతారని, పెద్ద ప్రొడ్యూసర్లు సైతం రెవిన్యూలో అధిక భాగం కోల్పోవాల్సి వస్తుందని, ముఖ్యంగా డిజాస్టర్లకు పెద్ద దెబ్బ పడుతుందని రకరకాల అభిప్రాయాలు వినపడుతున్నాయి.
ఇలాంటి టైంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి లేటుగా ఓటిటి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఒకవేళ వ్యూస్ కనక భారీగా వస్తే అదో సానుకూల సంకేతంగా చూడొచ్చు. ఎందుకంటే థియేట్రికల్ గా భారీ వసూళ్లు తేని సినిమా రెండు నెలల తర్వాత కూడా డిజిటల్ లో జనాన్ని ఆకట్టుకుందంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అవుతుంది.
హిందీ, మలయాళం లాగా మనమూ లేట్ విండో అమలు చేయాలని అగ్ర నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అసాధ్యం కాదు కానీ అందరికీ ఒప్పించడం పెద్ద సవాల్ లాంటిది. ఏకాభిప్రాయం వస్తే పరిశ్రమకు మంచిదే. కాకపోతే ఓటిటిలు ఎలా రియాక్ట్ అవుతాయనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates