ఘోర ప్రమాదం జరిగి కార్మికులు చెల్లాచెదురు అయిపోతే… ప్రభుత్వం, ప్రతిపక్షాలు ప్రమాద స్థలిని సందర్శించి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించి, ఆ మేరకు కొంతమేర సాయం అందించాక గాని అసలు కంపెనీ యాజమాన్యం స్పందించక పోవడం నిజంగానే ఎక్కడ కూడా చూసి ఉండం. తన కంపెనీలో ప్రమాదం జరిగితే… అందరికంటే ముందు ఆ కంపెనీ యాజమాన్యం స్పందిస్తుంది. తన కార్మికులకు అండగా నిలబడుతుంది. అయితే సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ కంపెనీ తీరు మాత్రం ఇందుకు భిన్నం. ప్రమాదం జరిగి 48 గటలు గడిచిన తర్వాత గానీ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు.
సోమవారం ఉదయం సిగాచీలో ప్రమాదం జరిగితే… బుధవారం ఉదయం సిగాచీ కంపెనీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. అది కూడా ఏదో తన కార్మికుల సంక్షేమమో, లేదంటే చనిపోయిన తన కార్మికుల పట్ల బాధతోనే సిగాచీ ఈ ప్రకటన చేయలేదు. స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇవ్వడం కోసమే సిగాచీ ఈ ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. బాంబే స్టాక్ ఎక్సేంజీకి పంపిన వివరణనే సిగాచీ సెక్రటరీ వివేక్ కుమార్ బహిరంగ ప్రకటనగా మార్చి విడుదల చేశారు.
సిగాచీ ప్రకటన మేరకు… కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటిదాకా 40 మంది చనిపోయారని, 33 మందికి గాయాలు కాగా వారంతా హైదరాబాద్ లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.1 కోటి నష్ట పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక క్షతగాత్రులకు పూర్తి స్థాయి వైద్య చికిత్సలను తామే అందిస్తామని, అనంతరం వారికి అవసరమయ్యే వివిధ రకాల ఏర్పాట్లను కూడా కంపెనీనే సమకూర్చుతుందని తెలిపింది.
ఈ ప్రకటన కూడా కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ పేరు మీద రాగా.. కంపెనీ ఓనర్ ఇప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం. అంతేకాకుండా కంపెనీ యాజమాన్యానికి చెందిన ప్రతినిధులు ఎవ్వరూ ఇప్పటిదాకా ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాలేదు. వాస్తవానికి సిగాచీలో జరిగిన ప్రమాదం చాలా పెద్దది. ఇంకా శిథిలాల తొలగింపు జరుగుతోంది. శిథిలాల కింద మరింత మంది ఉన్నట్లు సమాచారం. శిథిలాల తొలగింపు పూర్తి అయ్యాక గానీ మృతుల సంఖ్య తెలియదని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates