శంకర్ కలల సౌథం కూలినట్టేనా

గేమ్ ఛేంజర్ దారుణంగా డిజాస్టరయ్యింది. ఇండియన్ 3 రిలీజవుతుందో లేదో కనీసం ఓటిటిలో అయినా వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. ఇంతటి సందిగ్ధం మధ్య దర్శకుడు శంకర్ తర్వాతి సినిమాల మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన డ్రీం ప్రాజెక్టుగా చెప్పుకుంటూ వచ్చిన వేల్పరికి నిర్మాతలు దొరకడం లేదని చెన్నై అప్డేట్. మూడు భాగాలుగా వెయ్యి కోట్ల దాకా బడ్జెట్ డిమాండ్ చేసే ఈ విజువల్ గ్రాండియర్ కోసం చాలా ఏళ్లుగా వర్క్ చేస్తున్న శంకర్ కు ఇప్పుడు దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడం పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది. ఈయన్ను నమ్మి అంత ఖర్చు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట.

పొన్నియిన్ సెల్వన్ తరహాలో వీరయుగ నాయగన్ వేల్పరి కూడా పురాతన శతాబ్దాలకు చెందిన రాజుల కథ. నవల అద్భుతంగా ఉంటుంది. దీంట్లో కొన్ని ఘట్టాలని మణిరత్నం వాడుకున్నారని అప్పట్లో పత్రికా కథనాలు వచ్చాయి. కానీ దానికి శంకర్ ఇన్ డైరెక్ట్ గా అసంతృప్తి వ్యక్తం చేసి అక్కడితో వదిలేశారు. ఇప్పుడు వేల్పరిని తెరకెక్కించాలంటే లైకా, సన్ పిక్చర్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థలు అయితేనే సాధ్యమవుతుంది. కానీ శంకర్ ప్రతిపాదనలు ఎవరు పట్టించుకుంటారనేది అసలు ప్రశ్న. ముందు ఇండియన్ 3 రిలీజ్ చేస్తే కనీసం ఓ మాదిరి హిట్టనిపించుకుంటే తర్వాత వేల్పరి సంగతి చూడొచ్చు.

ఒకప్పుడు సౌత్ సినిమా స్థాయిని పెంచే జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, రోబో లాంటి క్లాసిక్స్ ఇచ్చిన శంకర్ కు ఇలాంటి పరిస్థితి రావడం అనూహ్యం. రాజమౌళికే స్ఫూర్తిగా నిలిచిన దర్శకుడికి ఈ స్టేజి రావడం విచారకరం. పైగా శంకర్ తో నిబంధనలతో కాంట్రాక్ట్ రాయించుకోక పోవడం వల్లే గేమ్ ఛేంజర్ చేయి జారిపోయిందని నిర్మాత దిల్ రాజు ఇటీవల చెప్పడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. అన్నట్టు శంకర్ కూతురు అదితి శంకర్ కూడా టైం కలిసి రాక పోరాడుతోంది. తమిళంలో హీరోయిన్ గా రాణింపు అంతంత మాత్రంగా ఉండగా తెలుగు డెబ్యూ భైరవం ఫ్లాప్ కావడంతో అవకాశాలను రావడం కష్టమే.