ఇదేం రాక్ష‌సానందం అన్న‌య్యా?: ష‌ర్మిల

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు.”ఇదేం రాక్ష‌సానందం” అంటూ.. విమ‌ర్శ‌లు గుప్పించారు. గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల గ్రామంలో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో జ‌గ‌న్ కారు డోర్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతుండ‌గా.. అదే కారు కింద ప‌డి సింగ‌మయ్య అనే వృద్ధుడు మృతి చెందిన దారుణ వీడియో వెలుగు చూసిన నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై ఆమె నిప్పులు చెరిగారు.

బాధ్య‌తాయుత నాయ‌కుడు చేసే ప‌ని ఇదేనా? అని ప్ర‌శ్నించారు. బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించే హ‌క్కు మీకు ఎవ‌రు ఇచ్చారు? అని నిల‌దీశారు. వంద మందికి మాత్ర‌మే పోలీసులు అనుమ‌తి ఇస్తే.. వేల మందికి అభివాదం చేసుకుంటూ మీరు ముందుకు సాగ‌డం, ఈ క్ర‌మంలో కారు కింద ప‌డి ఒక వ్య‌క్తి మృతి చెంద‌డం వంటివి మీకు సిగ్గ‌నిపించ‌డం లేదా? అన్నారు. బెట్టింగులు కాసి.. ఓడిపోయి.. ప్రాణాలు తీసుకున్న వ్య‌క్తులకు విగ్ర‌హాలు పెట్ట‌మ‌ని మీకు ఎవ‌రు చెప్పారు? అని నిల‌దీశారు.

ఒక పార్టీ అధ్య‌క్షుడిగా మీకు బాధ్య‌త లేదా? ఇంత బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తారా? అని ష‌ర్మిల ప్ర‌శ్న‌లు సంధించారు. ఇదేస‌మ‌యంలో ఆమె పోలీసుల తీరును కూడా త‌ప్పుబ‌ట్టారు. 100 మందికి ప‌ర్మిష‌న్ ఇచ్చి.. వేలాది మంది వ‌స్తుంటే.. నిలువ‌రించాల్సిన బాధ్య‌త పోలీసుల‌కు లేదా? అని అన్నారు. ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ ఏమైంద‌న్నారు. తాజాగా వెలుగు చూసిన వీడియో గ‌గుర్పాటుకు గురి చేసింద‌న్న ష‌ర్మిల‌.. దీనికి పూర్తి బాధ్య‌త జ‌గ‌న్‌దేన‌ని వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు.. ఈ ఘ‌ట‌న పై పోలీసులు కేసు న‌మోదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే స‌ద‌రు వాహ‌నాన్ని న‌డిపిన డ్రైవ‌ర్‌పై కేసు పెట్టారు. అయితే.. దీనికి జ‌గ‌న్ బాధ్యుడా? కాదా? అనే విష‌యంపై న్యాయ నిపుణుల‌ను సంప్ర‌దిస్తున్నారు. వారి ఉంచి క్లారిటీ తీసుకున్నాక‌.. జ‌గ‌న్‌పైనా కేసు పెట్టే యోచ‌న‌లో ఉన్నారు.