బనకచర్ల పై బీజేపీ తేల్చేనా

బనకచర్ల… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన వ్యవహారంగా మారిన సాగు, తాగు నీటి ప్రాజెక్టు. అసలు చిత్రం ఏంటంటే దీనికి సంబంధించిన ప్రణాళికే ఇంకా సిద్ధం కాలేదు. కేవలం ఇది నోటి మాట పైనే ఉంది. కేంద్రానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేరవేసింది అంతే. కేంద్రం ఓకే అంటే ఆ తర్వాత అసలు పనులు ప్రారంభం అవుతాయి. అంటే ప్రాజెక్టు ప్రయోజనాలు, బనకచర్ల గ్రామం (కర్నూలు జిల్లాలో) లో ఎక్కడ నిర్మించాలి, ఎలా ప్రారంభించాలి, దీనికి అయ్యే వ్యయం, ఎన్ని ఎకరాలు సమీకరించాలి అనే విషయాలు తేలుతాయి.

కానీ ఇది నోటి మాటగా ఉన్న సమయంలోనే ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలోనూ రాజకీయ భోగి మంటలు రేగుతున్నాయి. తాజాగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు. మీకు ఎంతైనా కేంద్రంలో పలుకుబడి ఉండొచ్చు, ప్రధాని మోడీ మీరు కూర్చోమంటే కూర్చోవచ్చు, నిలబడమంటే నిలబడవచ్చు కానీ అన్ని విషయాల్లోనూ మీరు చెప్పినట్టు జరగదు అని హెచ్చరించారు. అంటే బనకచర్ల ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ ఏపీ ఆశలన్నీ కేంద్రంలోని బీజేపీ సర్కారుపైనే ఉన్నాయి. తాము చెప్పినట్టు కేంద్రం వింటుందని సహజంగా కేంద్రానికి మద్దతు ఇచ్చిన చంద్రబాబు ఆశించవచ్చు. దీనిలో తప్పుకూడా లేదు. కానీ ఇది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అక్కడి అధికార, ప్రతిపక్షాలు ఘంటా కంఠంగా చెబుతున్నాయి. దీనిని తప్పకుండా బీజేపీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఎందుకంటే తెలంగాణలో అధికారంపై బీజేపీ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమిగా అధికారంలో ఉన్నా తెలంగాణలో అధికారం కీలకం.

దీంతో బీజేపీ ప్రభుత్వం (కేంద్రంలో) ఏమేరకు బనకచర్ల పై ఆమోదం తెలుపుతుందన్నది ప్రశ్నగా మారింది. బండి సంజయ్ వంటి కేంద్ర మంత్రి, తెలంగాణ నాయకుడు కూడా బనకచర్లకు వ్యతిరేకంగా కేంద్రానికి రహస్య నివేదిక పంపించారన్న చర్చ సాగుతోంది. దీనికి అనుమతి ఇస్తే తెలంగాణలో బీజేపీ తీవ్ర ఇరకాటంలో పడుతుందన్న చర్చ కూడా ఉంది. దీంతో కేంద్రం ఈ విషయంలో ఏమేరకు చంద్రబాబుకు సహకరిస్తుందన్నది ప్రశ్న. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాదిరిగా దీనిని కూడా నాన్చుడు ధోరణిలో కేంద్రం ముందుకు సాగదీస్తుందని అంటున్నారు పరిశీలకులు.