కుప్పం ఘ‌ట‌న‌పై ష‌ర్మిల సీరియ‌స్‌.. ఏమ‌న్నారంటే..

సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఓ మ‌హిళ‌ను చెట్టుకు క‌ట్టేసి హింసించిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర‌క‌ల‌క‌లం సృష్టించింది. ఇది అనేక ప్ర‌శ్న‌ల‌కు దారి తీస్తోంది. తిమ్మ‌రాయ‌ప్ప అనే వ్య‌క్తి ముని క‌న్న‌ప్ప అనే వ్య‌క్తిద‌గ్గ‌ర 80 వేల రూపాయ‌లు అప్పుగా తీసుకున్నారు. దీనిని తీర్చ‌లేక‌.. ఆయ‌న పొరుగు ప్రాంతానికి వెళ్లిపోయాడు. దీంతో ఆయ‌న భార్య శిరీష కూడా.. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్లి గుట్టుగా జీవిస్తోంది. అయితే.. తాజాగా ఆమె సొంత ప్రాంతానికి వ‌చ్చారు.

ఈ విష‌యం తెలిసి.. అప్పు ఇచ్చిన తిమ్మ‌రాయ‌ప్ప కుటుంబం ఆమెను నిర్బంధించి చెట్టుకు క‌ట్టేసి హింసించిన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు వెంట‌నే రియాక్ట్ అయ్యారు. బాధితుల‌కు అండ‌గా ఉండాల‌ని, నిందితుల‌ను శిక్షించాల‌ని ఆయ‌న సూచించారు. అయితే.. దీనిపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల స్పందించారు. అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషమ‌న్నారు.

సభ్య సమాజం తల దించుకొనే దుశ్చర్యగా దీనిని అభివ‌ర్ణించారు. కన్న కొడుకు ముందే తల్లికి జరిగిన ఘోర అవమానాన్ని సాటి మహిళగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని చెప్పారు. తెలుగింటి ఆడపడుచుకి సీఎం ఇలాకాలోనే రక్షణ లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనమ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే ధైర్యం కుప్పంలో చంద్రబాబు గారు ఇచ్చారా ? అని నిలదీశారు. లేక మహిళా హోంమంత్రి గారు ఇచ్చారా ? అని ప్ర‌శ్నించారు.

మహిళల మీద ఇలాంటి దాడులు జరగడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఆడపడుచుల పక్షపాతి అని, తెలుగింటి ఆడపడుచుల పార్టీ తెలుగుదేశం పార్టీ అని.. గొప్పలు చెప్పుకోవడం పక్కన పెట్టి ఇలాంటి అమానవీయ ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూడండి అని చంద్ర‌బాబుకు సూచించారు. ఆ మహిళకు జరిగిన అవమానానికి బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు.