ఈ దెబ్బతో కాంగ్రెస్ ఖల్లాస్

తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ దెబ్బ తింటే తిననీ.. తెలంగాణలో అయినా అధికారంలోకి వస్తాం కదా అనుకుని ఆరేళ్ల కిందట వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ విభజన క్రెడిట్ ఆ పార్టీకి దక్కలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నాయకత్వ లేమితో ఇబ్బంది పడ్డ ఆ పార్టీకి 2014లో ఎన్నికల్లో ఒక ముఖచిత్రం అంటూ లేకపోయె.

అటు వైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహాబలుడిలా కనిపిస్తుంటే.. ఇటువైపు కాంగ్రెస్‌లో దీటైన ఒక్క నాయకుడూ కనిపించలేదు. విభజన క్రెడిట్ అంతా తనే తీసుకుని ఆ ఎన్నికల్లో విజయం సాధించాడు కేసీఆర్. అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ కిందికి పడటమే తప్ప పైకి లేచిందే లేదు. రెండో పర్యాయం మరింత ఘోరమైన ఫలితాలు వచ్చాయి. లగడపాటి సర్వేతో కొన్ని రోజులు గాల్లో తేలిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఎలా చతికిలపడిందో తెలిసిందే.

చూస్తుండగానే కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఎలా కోల్పోయిందో చెప్పడానికి తాజాగా దుబ్బాక ఉప ఎన్నికే నిదర్శనం. కాంగ్రెస్‌ను పక్కకు నెట్టేసి టీఆర్ఎస్‌తో దీటుగా పోరాడి సంచలన విజయం సాధించింది బీజేపీ. ఒకప్పుడు ఇక్కడ ఆధిపత్యం చలాయించిన కాంగ్రెస్ అసలు ఇప్పుడు సోదిలోనే లేదు. ఆ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటనడానికి ఈ ఎన్నికల ఫలితాలు సూచిక. కాస్తో కూస్తో ఇప్పటిదాకా ఆ పార్టీ మీద ఆశలున్నవాళ్లందరూ ఇక ఎగ్జిట్ వైపు చూడటం ఖాయం. ఇక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే అనడంలో మరో మాట లేదు.

కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందనే అభిప్రాయానికి ఇటు నాయకులు, అటు ప్రజలు వచ్చేసినట్లే. రాబోయే రోజుల్లో పేరున్న కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది బీజేపీలో చేరడం లాంఛనమే. రేవంత్ రెడ్డి సహా చాలామందిని వచ్చే ఎన్నికల్లో బీజేపీలో చూస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది. పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల మధ్యనే అనడంలో సందేహం లేదు. ఏడేళ్ల ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడి ప్రజల అభీష్టానికి తగ్గట్లే విభజన నిర్ణయం తీసుకుని కూడా ఇంత త్వరగా ఇలాంటి దుస్థితికి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.