తెలుగు దేశం పార్టీ… తెలుగు ప్రజల ఆత్మ గౌరవ పరిరక్షణే పరమావధిగా ఏర్పాటైన పార్టీ. 40 ఏళ్లకు పైగా ప్రస్థానం సాగిస్తున్న టీడీపీ… అన్ని సమయాల్లో కంటే ఇప్పుడు అత్యంత బలీయంగా ఉందని చెప్పాలి. జనసేన, బీజేపీలతో జత కట్టిన టీడీపీ… ఏపీ అసెంబ్లీని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన టీడీపీ.. అటు కేంద్రంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఆవిర్భవించిన తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వవైభవం కల్పించే దిశగా పార్టీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చర్యలు ప్రారంబించేశారు.
గత కొంతకాలం క్రితమే చంద్రబాబు ప్రారంభించిన ఈ చర్యలు క్రమంగా సఫలం అవుతున్నాయి. గతంలో టీడీపీలో కీలక నేతగా పనిచేసిన నల్లగొండ కీలక రాజకీయవేత్త, కేంద్ర మాజీ మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం హైదరాబాద్ లో చంద్రబాబుతో బేటీ అయ్యారు. ఏపీ సీఎంగా బిజీబిజీగా ఉంటున్న చంద్రబాబు… వీకెండ్స్ లో ఫ్యామిలీతో్ గడిపేందుకు హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్ చేరిన బాబుతో గుత్తా భేటీ అయ్యారు. వీరి భేటీలో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్న విషయాన్ని పక్కనపెడితే… టీ టీడీపీ రీయూనియన్ దిశగా పకడ్బందీగానే అడుగులు పడుతున్నాయని చెప్పక తప్పదు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అదికారాన్ని దుర్వినియోగం చేసిందంటూ ఇంటా బయటా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన కీలక పరిణామాలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. కేసీఆర్ సహా బీఆర్ఎస్ కు చెందిన చాలా మంది నేతలు ఈ విచారణలు, కేసుల్లో ఇరుక్కుని నానా అవస్థలు పడుతున్నారు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్… అంతగా బలంగా లేదనే చెప్పాలి. అదికారం ఉంది కదా అన్న థీమా తప్పించి వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరతారమన్న నమ్మకం అయితే ఆ పార్టీ నేతల్లో పెద్దగా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే…ఇప్పుడున్న కాంగ్రెస్ కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇద్దరు కీలక మంత్రులు టీడీపీ నుంచి వచ్చిన వారే. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలే. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరు పార్టీ మారక తప్పలేదు. ఇక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ లో ఒకింత ఇనాక్టివ్ గా ఉన్న మండవ వెంకటేశ్వరరావు, మాజీ మంత్రులు దేవేందర్ గౌడ్ కుమారులు, నాగం జనార్థన్ రెడ్డి కుమారుడు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాసరెడ్డి తదితరులు బాబు ఇలా పిలిస్తే… అలా టీడీపీలోకి వచ్చి యాక్టివ్ అయ్యేందుకు సదా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన 2028 చివరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీ టీడీపీ సత్తా చాటడం ఖాయమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates