గత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చద్రబాబు గురువారం నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తాజా శుక్రవారం నుంచి లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి తల్లికి వందనం పథకం కింద 52 వేల రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాలో వేసింది. ఈ ఆనందాన్ని పంచుకుంటూ.. సదరు కుటుంబం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గతంలో వైసీపీ హయాంలో తమకు ఒక్క చిన్నారికి మాత్రమే అమ్మ ఒడి పడిందని.. ఇప్పుడు నలుగురికి తల్లికి వందనం అందిందని ఆ కుటుంబం పేర్కొంది. చెప్పిన మాటకు కట్టుబడి చంద్రబాబు చేసిన సాయంతో తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటామన్నారు.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. దాదాపు 32 లక్షల మందికి శుక్రవారం ఈ సొమ్ములు వారి వారి ఖాతాల్లో పడ్డాయి. మరికొందరికి వివిధ కారణాలతో ఆలస్యమవుతున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో ఆ సొమ్ములతో తమ చిన్నారులకు పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“నలుగురు పిల్లలు ఉన్న తల్లికి, “తల్లికి వందనం” కింద చంద్రన్న రూ.52 వేలు పంపించాడు. జగన్ రెడ్డి 5 ఏళ్ళలో వేసిన డబ్బు, చంద్రబాబు గారు ఒక్క ఏడాదిలో వేసారు. మా కుటుంబానికి ఒక్కసారిగా రూ.52 వేలు వచ్చాయి.” అని తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates