“రౌడీలతో రాజకీయాలు చేస్తావా?” చంద్రబాబు ఆగ్రహం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. “జ‌గన్ .. నీకిదే చెబుతున్నా..” అంటూ తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించారు. రాజ‌కీయాల ముసుగులో అరాచ‌కాల‌కు పాల్ప‌డితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని తేల్చి చెప్పారు. రౌడీల‌కు, గంజాయి బ్యాచుల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారంటూ.. నిప్పులు చెరిగారు. “ఎంత ధైర్యం ఉంటే రౌడీ మూకల ఇళ్ల‌కు వెళ్లి వారిని ప‌రామ‌ర్సిస్తావ్‌? గంజాయి బ్యాచ్‌ను వెనుకేసుకు వ‌స్తావ్‌?!” అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. నేర‌స్తుల‌ను వెనుకేసుకు వ‌స్తూ.. వారితో క‌ల‌సి రాజ‌కీయాలు చేయ‌డం.. నేర‌స్తుల‌కు ప్ర‌ధాన ల‌క్షణంగా మారింద‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. ఇలాంటి వారిని ఎలా లైన్‌లోకి తీసుకురావాలో త‌న‌కు బాగానే తెలుసున‌న్నారు. గ‌తంలో తాను ఫ్యాక్ష‌న్‌ను అణిచి వేసిన విష‌యాన్ని జ‌గ‌న్ తెలియ‌క‌పోతే.. తెలుసుకోవాల‌ని సూచించారు. ఇక‌, తాజాగా బుధ‌వారం ప్ర‌కాశం జిల్లా పొదిలిలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌నలో జ‌రిగిన అరాచ‌కాల‌ను కూడా సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.

“పొదిలిలో బాధ్యత లేకుండా పర్యటిస్తావా? దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అంటారా? రౌడీలను వెంటేసుకొని వెళ్లి రౌడీయిజం చేస్తారా? శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదు. ఎవ‌రిని ఎక్క‌డ ఉంచాలో నాకు బాగా తెలుసు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను మంచిగా పాలించా. ఇక‌, నా ప్ర‌తాపం చూపితే నువ్వు, నీ ముఠా త‌ట్టుకోలేదు” అంటూ సీఎం చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా.. వాళ్ల‌కు ఇంకా బుద్ధి రాలేద‌ని, సంస్కార హీనంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

అమ‌రావ‌తిని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు దేవ‌త‌ల రాజ‌ధానిగా పేర్కొంటే.. జ‌గ‌న్ ముఠా.. దీనిని వేశ్య‌ల రాజ‌ధాని అంటూ.. మ‌హిళ‌ల‌ను అవ‌మానిస్తుందా? అని ప్ర‌శ్నించారు. తోక‌లు జాడిస్తే.. క‌త్తిరిస్తా! అంటూ.. చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. “ప‌విత్ర‌మైన రాజ‌ధానిని చూసి ఓర్వ‌లేక‌పోతే.. గ‌మ్మునుండాలి. కానీ.. ఇలా అవ‌మానిస్తారా?” అని వ్యాఖ్యానించారు. జగన్‌ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌జ‌లు ఇక‌, వైసీపీ పేరు కూడా త‌లుచుకోకుండా చేశామ‌ని అన్నారు. ఈ మేర‌కు తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.