=

నిజమా?… హరీశ్, ఈటెల భేటీ అయ్యారా?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రోజుకో సరికొత్త పరిణామం చోటుచేసుకుంటూ ఉంది. మొన్నటిదాకా అంతగా పెద్ద సంచలనాలేమీ లేకుండానే సాగిన తెలంగాణ రాజకీయం ఇప్పుడు రోజుకో సంచలనాన్ని తీసుకొస్తూ కాక రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన పగుళ్లపై విచారణకు ఆదేశాలు జారీ చేయగా… ఆ విచారణ కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు నాడు బీఆర్ఎస్ కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ లు రానున్నారు. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీల బంధంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం సంచలన ఆరోపణలు గుప్పించారు.

కాళేశ్వరం అవకతవకలపై విచారిస్తున్న జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించి ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించేందుకు పార్టీలను పక్కనపెట్టిన హరీశ్ రావు, ఈటెల రాజేందర్ లు రహస్య భేటీ అయ్యారని మహేశ్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన సందర్భంగా అందరం ఒకటే సమాదానం చెప్పే దిశగా వారిద్దరూ ఓ అవగాహనకు వచ్చేందుకే ఈ రహస్య భేటీ జరిగిందని కూడా ఆయన ఆరోపించారు. కేసీఆర్ స్వయంగా ఆదేశించడంతోనే హరీశ్ రావు ఇటీవలే షామీర్ పేటలో ఈటెలతో రహస్యంగా భేటీ అయ్యారని ఆయన తెలిపారు. కమిషన్ ముందు తలా ఒక సమాధానం చెబితే అందరం బుక్ అవుతామన్న భయంతోనే కేసీఆర్… ఈటెలతో రాజీకి హరీశ్ ను పురమాయించారని ఆయన ఆరోపించారు.

వాస్తవానికి తెలంగాణ ఉద్యమం నుంచి ఈటెల… కేసీఆర్ తో కలిసి సాగారు. హరీశ్ రావు తర్వాత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగానూ ఈటెల ముద్ర వేయించుకున్నారు. ఈ కారణంగానే బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఈటెలకు ఆర్థిక శాఖ పగ్గాలు దక్కాయి. ఆ తర్వాత కూడా ఈటెలకు ఏమాత్రం ప్రాధాన్యం తగ్గలేదు. అయితే 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్, ఈటెల మద్య ఏం జరిగిందో తెలియదు గానీ… వారిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఈటెల అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసీఆర్ సర్కారు ఆయన కుటుంబంపై కేసులు కూడా నమోదు చేసింది. వీటన్నింటినీ భరిస్తూనే సాగిన ఈటెల సరైన సమయం చూసుకుని బీజేపీలో చేరిపోయారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వెరసి ఇప్పుడు పార్టీలను పక్కనపెడితే… బీఆర్ఎస్ కు చెందిన ఏ నేత అయినా ఈటెల విరుచుకుపడిపోతున్నారు.

అలాంటిది హరీశ్ రావు పిలవంగానే ఈటెల ఆయనతో రహస్య భేటీకి వెళ్లి ఉంటారా? అనేది ప్రశ్నార్థకమే. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలను తెలిసినట్లుగానే వెల్లడించేందుకు కూడా ఈటెల సిద్ధ పడ్డారు. అదే జరిగితే కేసీఆర్ శిభిరానికి కష్టకాలం తప్పదు. ఈ కారణంగా ఈటెలతో రాజీకి కేసీఆర్ సిద్ధపడ్డారని మహేశ్ ఆరోపిస్తున్నారు. కేసీఆర్, హరీశ్ రావులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఈటెల మాత్రం నిజాలనే కాళేశ్వరం కమిషన్ కు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని అనుమానించాల్సి ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ రహస్య భేటీపైనా ఈటెల నోరు విప్పాలని కూడా మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.