సెలబ్రిటీలకు చెన్నై హైకోర్టు షాక్

ఆన్ లైన్ రమ్మీకి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న కొంతమంది సెలబ్రిటీలకు చెన్నై హైకోర్టులోని మధురై బెంచ్ పెద్ద షాకే ఇచ్చింది. ఆన్ లైన్లో రమ్మీ ఆడటం వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా ? అంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని హైకోర్టు సీరియస్ గా ప్రశ్నించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆన్ లైన్లో రమ్మీ ఆడుతున్న వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయమై చెన్నై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల కేసు దాఖలైంది. ఈ కేసును హైకోర్టు విచారించింది.

అసలు ఆన్ లైన్లో రమ్మీ ఆడమంటూ ఆయా కంపెనీలు చేస్తున్న ప్రచారానికి ప్రముఖులు ఎలా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారంటూ ఆశ్చర్యపోయింది. అందుకే సినీనటులు ప్రకాష్ రాజ్, తమన్నా భాటియా, రానా, సుదీప్ తో పాటు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేయటం సంచలనంగా మారింది. నిజానికి రమ్మీలాంటి జూద క్రీడలకు బహిరంగంగా ప్రోత్సహించటమే తప్పు. అలాంటి వాటికి సెలబ్రిటీలమని చెప్పుకునే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండటం ఇంకా తప్పు. అందుకనే హైకోర్టు వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది.

ఆన్ లైన్ రమ్మీలో జనాలు ఆడుతున్న డబ్బంతా ఎవరికి ? ఎక్కడికి వెళుతోందో తెలుసా అంటూ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. తెలంగాణాలో ఇప్పటికే ఆన్ లైన్ జూదాన్ని నిషేధించిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. తమిళనాడులో ఆన్ లైన్ జూదాన్ని నిషేధించటానికి ప్రభుత్వం ఎప్పుడైనా ప్రయత్నించిందా అని అడిగింది. హైకోర్టు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ప్రభుత్వం లాయర్ నుండి సరైన సమాధానం రాలేదు. దాంతో పదిరోజుల్లో ఆన్ లైన్ జూదాన్ని నిషేధించటానికి చర్యలు తీసుకుంటుందని ఆసిస్తు విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.

ఒక రాష్ట్రంలో ఆన్ లైన్ జూదంపై నిషేధం పడితే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటను పట్టడానికి ఎంతో కాలం పట్టదు. ఎందుకంటే ఆన్ లైన్లో జూదం ఆడి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆ పరిస్దితి రాకూడదనే ముందుగా తెలంగాణా ప్రభుత్వం నిషేధం విధించింది. ఓ అంచనా ప్రకారం ఆన్ లైన్ లో జూదం వల్ల దాన్ని డిజైన్ చేసిన కంపెనీలు ఏడాదికి సుమారు రూ. 1800 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.