పిక్ టాక్.. ఒకే ఫ్రేమ్ లో రేవంత్, లోకేశ్

ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో బుధవారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కనిపించారు. ఒకే ఫ్రేమ్ లో కనిపించిన వీరిద్దరూ అక్కడి వారికి వీనుల విందు చేశారనే చెప్పాలి. ఈ ఇద్దరిలో రేవంత్ ఇప్పటికే తెలంగాణకు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా… టీడీపీకి భావి అధినేతగా ప్రొజెక్టు అవుతున్న లోకేశ్.. పాలనలోనూ వేగంగా పురోగతి సాధిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరినీ చూసినంతనే… రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసినట్టే ఉందన్న మాట అయితే వినిపించింది.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ వివాహం బుధవారం విజయవాడ పరిధి కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ లో జరిగింది. ఈ వేడుకకు ఏపీకి చెందిన కీలక రాజకీయ నేతలతో పాటుగా తెలంగాణకు చెందిన పలువురు నేతలను కూడా దేవినేని ఉమా ఆహ్వానించారు. ఈ క్రమంలో దేవినేని ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం దేవినేని కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. రేవంత్ ఈ వేడుకకు హాజరైన సమయంలోనే లోకేశ్ కూడా అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా పక్కపక్కనే నిలిచి సాగిన రేవంత్, లోకేశ్ లు ఆ తర్వాత పక్కపక్కనే కూర్చుని చాలాసేపు ముచ్చటించుకున్నారు. వధూవరులను కూడా ఇరువురు నేతలు ఒకేసారి ఆశీర్వదించడం అందరినీ ఆకట్టుకుంది.

రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నేత కావచ్చు గానీ.. పూర్వాశ్రమంలో ఆయన టీడీపీ నేతే కదా. రాజకీయంగా రేవంత్ కు ఓ రేంజి ఎలివేషన్ వచ్చింది టీడీపీలోనే కదా. టీడీపీతోనే ఆయన తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టారు కదా. అంతేనా… తెలుగు నేల విభజన తర్వాత టీడీపీని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు.. రాజకీయంగా పరిణతితో వ్యవహరించిన రేవంత్… నేరుగా విజయవాడ వెళ్లి… తాను పార్టీ మారుతున్న విషయాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చెప్పి మరి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. టీడీపీలో నేర్చుకున్న రాజకీయ పార్టీలతోనే కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చిన రేవంత్ ఇప్పుడు ఏకంగా తెలంగాణలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇలాంటి క్రమంలో టీడీపీ భావి నేతగా కొనసాగుతున్న లోకేశ్ తో రేవంత్ కఃలిసి కనిపించిన వైనం అందరి దృష్టిని ఆకట్టుకుంది.