స్కూళ్ళకు అడ్డురాని కరోనా ఎన్నికలకే వస్తోందా ?

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజుకు సగటున 3 వేలు నమోదవుతున్న మాట వాస్తవమే. ఈ కారణంతోనే మార్చిలో వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను ఇపుడు నిర్వహించలేమని ప్రభుత్వం కోర్టులో చెప్పింది. ఎన్నికల కమీషన్ ఏమో మార్చితో పోల్చుకుంటే ఇపుడు కరోనా వైరస్ కేసులు తగ్గింది కాబట్టే స్దానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇపుడిదే అంశంపై పెద్ద వివాదమే మొదలవ్వబోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ కేసులు, స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణలో ఇటు ప్రభుత్వంది, అటు ఎలక్షన్ కమీషన్ ఇద్దరిదీ తప్పే కనబడుతోంది. రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క కేసు ఉన్నపుడు మార్చిలో కరోనా వైరస్ ను చూపించి ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేయటం నిమ్మగడ్డ చేసిన తప్పు అన్నది ఏపీ సర్కారు వాదన.

తాజాగా ఇదే అంశంపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎలక్షన్ కమీషన్ కరోనా వైరస్ కేసులు తగ్గింది కాబట్టి ఎన్నికల నిర్వహణకు మేము రెడీ అంటూ చెప్పింది. వాయిదా వేసిన రోజు కంటే ఇపుడు ఎక్కువే కేసులున్నా… అవగాహన ఉంది, అన్ లాక్ ఉంది కాబట్టి, అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలను నిర్వహిస్తామని కోర్టులో చెప్పింది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ఎన్నికల నిర్వహణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామంటే ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు ? ఏమి జాగ్రత్తలు తీసుకున్నా ప్రభుత్వమే తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవటానికి నిమ్మగడ్డకు ప్రత్యేక యంత్రాంగం అంటూ ఏమీ లేదు. ఇక్కడే ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పేసింది. ఎందుకంటే వేలసంఖ్యలో పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది కూడా కరోనా వైరస్ భారిన పడ్డారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవటం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పేసింది.

మరోవైపు ఎన్నికల నిర్వహణకు కరోనా వైరస్ కారణమని చెప్పిన ప్రభుత్వం మరి స్కూళ్ళను మాత్రం ఎలా తెరిచింది ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఓసారి స్కూళ్ళంటు తెరిస్తే వేలాదిమంది పిల్లలు స్కూళ్ళలో ఒకేచోట గుమిగూడుతారు. అప్పటికే వారిలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే మిగిలిన వారికి సోకే ప్రమాదం ఉంది. మొదటిరోజు స్కూళ్ళు తెరిచినపుడే టీచర్లు, విద్యార్ధుల్లో కొందరికి కరోనా ఉన్న విషయం బయటపడింది.

కాబట్టి ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ప్రభుత్వం, నిమ్మగడ్డ ఇద్దరిలోను తప్పులున్నాయి. ఇద్దరి మధ్య సమస్యను పరిష్కరించాల్సిన కోర్టు ప్రతి విషయంలోను ప్రభుత్వాన్నే తప్పుపడుతోంది. అందుకనే ప్రభుత్వం కూడా నిమ్మగడ్డ నిర్ణయాలపై సుప్రింకోర్టుకు వెళుతోంది. మరి ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో ఏమో.