గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ… నాటి భూ రికార్డుల వెబ్ సైట్ ధరణిపై సంచలన ఆరోపణలు గుప్పించింది. అధికారంలోకి వచ్చాక ధరణిని సముద్రంలో పారేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీనే కాకుండా ధరణిని రూపొందించిన బీఆర్ఎస్ సర్కారు కూడా ఈ వెబ్ సైట్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించింది.
ధరణి వల్లే లెక్కలేనన్ని వివాదాలు తలెత్తాయని, తమ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని కూడా ఆ పార్టీ కీలక నేతలు గుసగుసలాడిన వైనమూ తెలిసిందే. ఎవరు ఔనన్నా…ఎవరు కాదన్నా కూడా ధరణి బీఆర్ఎస్ విజయావకాశాలను నిర్వీర్యం చేసిందని చెప్పాలి. ధరణితో రాష్ట్రంలోని విలువైన భూములన్నీ బీఆర్ఎస్ నేతల హస్తాల్లోకి వెళ్లిపోయాయని సాధారణ జనం కూడా భావించారు. ఫలితంగా ఎన్నికల్లో ధరణిని తీసుకువచ్చిన బీఆర్ఎస్ కు ఓడించి… ధరణిని సముద్రంలో పాతరేస్తామన్న రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
అనుకున్నట్లుగానే ధరణిని పక్కనపెట్టేసిన రేవంత్ రెడ్డి సర్కారు… దశలవారీగా సమీక్షలు నిర్వహించి ఏడాదిన్నరకు గానీ ధరణి స్థానంలో భూభారతి పేరిట భూముల రికార్డులకు సంబంధించిన నూతన వ్యవస్థను అమలులోకి తీసుకువచ్చింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని లాంఛనంగా ప్రారంభించారు. మరి ఇప్పుడేంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. ధరణిలో లేని విధంగా భూముల రికార్డుల నిర్వహణ, వాటిపై అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం పేరిట కొత్తగా పలు వెసులుబాట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
అంతేకాకుండా సామాన్య జనానికి కూడా అర్థమయ్యేలా ఈ సైట్ ను ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు, ఉర్దూ భాషల్లోనూ అందుబాటులో ఉండేలా చేసింది. అంతేకాకుండా పలు క్లిష్టమైన అంశాలను కూడా భూభారతిలోకి అనుమతించలేదనే చెప్పాలి. ఇక కీలకంగా భావిస్తున్న ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణ బాధ్యతలను సీసీఎల్ఏకు అప్పగించిన వైనం కూడా ఒకింత శుభ పరిణామమేనని చెప్పక తప్పదు. ఈ విధానంతో ప్రభుత్వ, అసైన్డ్ భూముల అన్యాక్రాంత అంత ఈజీ కాదన్న వాదన అయితే వినిపిస్తోంది.
ఇక రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలను ఏటా డిసెంబర్ 31న ఆయా గ్రామాల్లో ప్రదర్శించేలా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో ప్రకటించే ఈ భూముల వివరాలు తప్పనిరిగా భూభారతిలోనూ కొనసాగక తప్పదు. అంటే… ఆయా భూముల అన్యాక్రాంతం గానీ, ఇతరులు బలవంతంగా తమ పేర్లపైకి మార్చుకోవడం గానీ అంత సులభం కాదనే చెప్పాలి. గ్రామాల్లోని జాబితాలతో భూభారతిలో తారతమ్యాలు ఉంటే… ఆయా భూముల యజమానులు అప్పీళ్లకు వెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ఇక నాడు ధరణిని అయినా… నేడు భూభారతిని అయినా నిర్వహించాల్సింది రెవెన్యూ శాఖనే కదా.
నాడు ధరణిని భ్రష్టు పట్టించిన రెవెన్యూ శాఖ… ఈ సారి భూభారతిని పక్కదారి పట్టించదా? అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నా… ఏటా భూముల రికార్డుల ప్రకటన అన్నది దానికి చెక్ పెట్టనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రికార్డులను వెబ్ సైట్ లో ట్యాంపర్ చేయడం భూభారతిలో అంత సులభం కాదని చెప్పాలి. అయినప్పటికీ… ఇటు ప్రభుత్వంతో పాటు భూ యజమానులు నిత్యం దీనిపై ఓ కన్నేసే వెసులుబాటు ఉండటంతో అక్రమాలకు పెద్దగా ఆస్కారం ఉండదని చెప్పక తప్పదు.
ఓ రాజకీయ పార్టీ భవితవ్యాన్నే ధరణి మార్చేయగా… తమ భవిష్యత్తును పదిలం చేసుకునే దిశగా కదులుతున్న రేవంత్ రెడ్డి సర్కారు… భూభారతిని ఒకింత పకడ్బందీగానే అమలు చేసి తీరుతుందన్న వాదన అయితే రాష్ట్రంలో గట్టిగానే వినిపిస్తోంది. అధికారం అన్నది అధికారంలో ఉన్న ఆయా నేతలు, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపైనే ఆధారపడి ఉందన్న విషయాన్ని మననంలో ఉంచుకునే భూభారతికి రేవంత్ సర్కారు రూపకల్పన చేసిందని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా ఏమాత్రం బేషజాలు లేకుండానే కుండబద్దలు కొట్టేశారు.
ధరణిలో వచ్చినట్లుగా భూభారతిపై వివాదాలు, విమర్శలు రాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగానిదేనన్న రేవంత్… మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా భూముల రికార్డులను ఎప్పటికప్పుడు భద్రపరచడంతో పాటుగా వాటి ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత మంత్రిమండలితో పాటు ప్రజాప్రతినిధులదేనని చెప్పుకొచ్చారు. మొత్తంగా ధరణి అనుభవాలు పునరావృతం కాకుండా చూసే దిశగా రేవంత్ సర్కారు భూభారతిలో పకడ్బందీ చర్యలు చేపడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 15, 2025 1:12 pm
ఏపీలో పెను కలకలమే రేపుతున్నమద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణిస్తున్న ఏపీ ప్రభుత్వ…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆశలన్నీ ఇప్పుడు రాబోయే సినిమా మీదే ఉన్నాయి. మిస్ శెట్టి మిస్టర్…
పవన్ కళ్యాణ్ OGతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కొత్త సినిమా 'గ్రౌండ్ జీరో'…
థియేటర్ రిలీజ్ కావాల్సినంత బిల్డప్ ఉన్న సినిమా ఓటిటిలో వస్తే అంతకంటే ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది. అందులోనూ ఫైటర్ దర్శకుడు…
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వసూళ్లు ఇప్పటికిప్పుడు…
``ఏపీ ప్రభుత్వం చెబుతున్న సమాచారాన్ని బట్టి.. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం కుదరదు.…