వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కు టులెట్ బోర్డు!

ఏపీ రాజధాని పరిధి అమరావతిలోని తాడేపల్లిలో సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన వైసీపీ కేంద్ర కార్యాలయం నిజంగానే మొన్నటిదాకా కళకళలాడింది. దాదాపుగా 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో బహుళ అంతస్తుల భవనంగా ఉన్న ఈ భవంతిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందే నిర్మించారు. పార్టీ కార్యాలయాన్ని మెయిన్ రోడ్డుకు ఆనుకుని నిర్మించిన జగన్… దాని వెనకాలే తన ఇంటిని నిర్మించుకున్నారు. ఇప్పుడు రోడ్డుకు అభిముఖంగా ఉన్న వైసీపీ ప్రధాన కార్యాలయం కొనసాగిన అద్దాల మేడకు టులెట్ బోర్డు దర్శనమిస్తోంది. ఆసక్తి ఉన్న వారు ఆ భవంతిని అద్దెకు తీసుకోవచ్చు.

వైసీపీ కేంద్ర కార్యాలయానికి టులెట్ బోర్డు ఏమిటి? జగన్ రాజకీయ ప్రత్యర్థులు ఆయనను, ఆయన పార్టీని హేళన చేసే క్రమంలోనే ఈ భవంతికి టులెట్ బోర్డు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారులే అని అంతా అనుకున్నారు. అయితే ఇది దుష్ప్రచారం ఏమీ కాదు. చుట్టూ అద్దాలతో అత్యంత సుందరంగా నిర్మితమైన సదరు భవంతికి జగన్ అండ్ కో నిజంగానే టులెట్ బోర్డు పెట్టేశారు. దీనికి సంబంధించిన పక్కా ఫొటోలు శనివారం నాటి మెయిన్ మీడియాలో ప్రచురితమయ్యాయి. వైసీపీ కేంద్ర కార్యాలయంగా కొనసాగిన నాడు ఆ భవంతి ఎలా ఉన్నది?.. ఇప్పుడు అద్దెకు ఇచ్చేందుకు రంగం సిద్ధం అయిపోయిన తర్వాత ఆ భవంతి ఎలా ఉంది? దానికి ఇప్పుడు టులెట్ బోర్డు వేలాడుతున్న వైనాన్ని చూపెట్టే ఫొటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ… ఏపీలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలను తనకు తానుగా కేటాయించుకుని పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంది. అయితే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం దక్కిన నేపథ్యంలో ఆ కార్యాలయాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ క్రమంలో చాలా భవనాల ముందు టులెట్ బోర్డులు పెట్టారంటూ ప్రచారం సాగింది. ఇలాంటి నేపథ్యంలో ఏకంగా వైసీపీ కేంద్ర కార్యాలయానికి టులెట్ బోర్డు వేలాడుతున్న వైనం నిజంగానే అమితాసక్తి రేకెత్తిస్తోంది. ఈ భవంతిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని జగన్ తన ఇంటి కోసం నిర్మించుకున్న సువిశాల భవంతిలోని కొంత ప్రాంతంలోకి మార్చారట. దీంతో ఈ భవంతి ఖాళీ కాగా… దానినే ఇప్పుడు అద్దెకు ఇచ్చేందుకు టులెట్ బోర్డు పెట్టారట. చూద్దాం మరి ఈ భవంతిని ఏ సంస్థ అద్దెకు తీసుకుంటుందో?