కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఆ పార్టీ సీనియర్ నేత.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సాకే శైలజానాథ్ చేసిన కామెంట్లను ఉటంకించారు. “షర్మిల కనిపించడం లేదు. అందుకే.. తాను పార్టీ నుంచి బయటకు వచ్చా” అని అప్పట్లో సాకే వ్యాఖ్యానించారు. తాజాగా.. షర్మిల దీనికి కౌంటర్ ఇచ్చారు. “నేను కనిపించడం లేదని అంటే.. మెడికల్ లీవు అనుకోవచ్చు కదా!” అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపైనే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రాజకీయాల్లో మెడికల్ లీవులు ఏంటి అక్కా! అంటూ.. విరుచుకుపడుతున్నారు. మరికొందరు.. మెడికల్ లీవు అంటే.. రోజులా.. నెలలా? సంవత్సరాలా? అని నిలదీశారు. గత ఏడాది ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన షర్మిల.. తర్వాత.. ఇప్పటి వరకు ఎవరి ముఖం చూసిన పాపాన పోలేదు. ఢిల్లీలో జగన్ ధర్నా చేసినప్పుడు.. ఏలూరుకు వచ్చిన షర్మిల.. అప్పట్లో ఎర్రకాలువ పొంగడంతో మునిగిన పొలాలను పరిశీలించారు.
ఉధృతంగా వస్తున్న వరద నీటిలో దిగి రాజకీయాలు చేశారన్న వాదన అప్పట్లో సొంత పార్టీ నాయకుల నుంచే వినిపించింది. ఆ తర్వాత.. సమయం సందర్భం చూసుకుని.. ఒక్కసారి కూడా.. ప్రజల మధ్యకు ఆమెరాలేదు. కనీసం.. ప్రజల కష్టాలు కూడా పట్టించుకోలేదని.. సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డే స్వయంగా ఓ యూట్యూబ్ చానెల్తో వ్యాఖ్యానించారు. ఇప్పుడు.. కూడా అదే తరహాలో సీనియర్లు ఉన్నారు. కొందరు అయితే.. షర్మిల నాయకత్వం తమకు వద్దని లేఖలు కూడా సంధించారు.
అయితే.. వైఎస్ ఇమేజ్ ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఆమెను కొనసాగిస్తుండడం గమనార్హం. కానీ.. ఇప్పటి వరకు గత ఎన్నికల సమయం నుంచి జరిగిపోయిన 11 మాసాల్లో ఒక్కసారి కూడా.. ఉత్తరాంధ్రలో కానీ.. సీమలో కానీ.. ఆమె ప్రజలకోసం పర్యటించింది లేదు. మరి ఎవరైనా మెడికల్ లీవు అంటే.. ఓ నెల రోజులు.. రెండు నెలలు.. తీసుకుంటారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు షర్మిల మెడికల్ లీవులోనే ఉంటారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తుండడం గమనార్హం.