తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచుగా పెద్ద పెద్ద వివాదాలే చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాదంతా ఆక్రమణ మీద హైడ్రా ఉక్కుపాదం మోపడంతో రగడ తప్పలేదు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. దశాబ్దాల నుంచి జరిగిన తప్పుల మీద దృష్టిసారించకుండా, సమస్యకు మూలమేంటో గుర్తించకుండా ఉన్నపళంగా ఇళ్లు కూల్చేసి అనేక కుటుంబాలను రోడ్డు పాలు చేయడం మీద విమర్శలు వచ్చాయి. వ్యతిరేకత బాగా పెరిగిపోవడంతో ఈ మధ్య హైడ్రా కొంచెం దూకుడు తగ్గించింది.
ఇప్పుడేమో కంచ గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు వాడుకోవాలని రేవంత్ సర్కారు నిర్ణయించడం తీవ్ర దుమారమే రేపుతోంది. పచ్చని చెట్లు, జంతుజాలానికి నెలవుగా ఉన్న ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ పర్యావరణ ప్రేమికులు గళం విప్పుతున్నారు. దీనిపై హెచ్సీయూ స్టూడెంట్స్ పెద్ద ఎత్తునే నిరసన చేస్తున్నారు. వారికి బీఆర్ఎస్, బీజేపీ మద్దతుగా నిలుస్తున్నాయి.
రోజు రోజుకూ నిరసన గళాలు పెరుగుతుండగా.. సినిమా వాళ్లు కూడా వాళ్లకు తోడవుతున్నారు. ఇప్పటికే ఈ భూముల వివాదంపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. ఇది మన కర్మ అంటూ గొడవ పెద్దది కాకముందే అతను పెట్టిన సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశం అయింది. ఇప్పుడు మరి కొందరు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా వాయిస్ వినిపిస్తున్నారు. రామ్ చరణ్ సతీమణి.. ఈ వ్యవహారంపై ఒక పోస్టు పెట్టారు. ఇక్కడున్న జంతువులు, పక్షులను మరోచోటికి తరలిస్తున్నారు. చెట్లను మరో చోట నాటుతున్నారా అని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు రేణు తన పోస్టులో కొంచెం గట్టిగానే మాట్లాడారు. తాను రేపో మాపో చనిపోవచ్చని, కానీ భవిష్యత్ తరాల కోసం ఆ భూములను నాశనం చేయొద్దని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చేయడానికి వేరే భూములు చాలా ఉంటాయని ఆమె అన్నారు. ఇంకోవైపు ప్రకాష్ రాజ్ సైతం ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. సమంత, ఈషా రెబ్బా, రష్మి లాంటి వాళ్లు కూడా ఈ భూములను, ఇక్కడున్న జంతువులు, చెట్లను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. చూస్తుంటే ఈ భూముల వ్యవహారం రేవంత్ సర్కారుకు చాలా చెడ్డ పేరే తెచ్చేలా ఉంది.