ఇప్పాల… ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారా?

ఏపీలో విపక్షం వైసీపీకి హార్డ్ కోర్ అభిమానిగానే కాకుండా ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా కొనసాగుతున్న ఇప్పాల రవీంద్రా రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ సిస్కోలో భారత వ్యవహారాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల వరకూ అకౌంట్ మేనేజర్ గా పనిచేస్తున్న ఇప్పాల.. మంగళవారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తో భేటీ సందర్బంగా ఒకింత అతి చేశారనే చెప్పాలి. గతంలో వైసీపీ యాక్టివిస్టు హోదాలో లోకేశ్ పై సభ్యత మరచి పోస్టులు పెట్టిన అతడు.. మంగళవారం లోకశ్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే యత్నం చేశారు. ఫొటోలకు ఫోజులూ ఇచ్చారు. సిస్కోను తానే తీసుకువచ్చినట్లుగా కూడా కలరింగ్ ఇచ్చారు.

అయితే… బుధవారం మాత్రం ఇప్పాల సిస్కో బృందం నుంచి గాయబ్ అయిపోయారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాల నుంచి ఆయనను తప్పించారా?.. లేదంటే ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకుని ఏకంగా ఉద్యోగంలో నుంచే తీసేశారా? అన్న దానిపై అంతగా స్పష్టత లేదు గానీ… ఇకపై ఆయన ఏపీలో సిస్కో వ్యవహారాల్లో మాత్రం కనిపించరని మాత్రం చెప్పక తప్పదు. మంగళవారం లోకేశ్ తో భేటీ అయిన సిస్కో బృందమే బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసింది. ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న మాదిరే తెలంగాణ సర్కారుతోనూ ఆ సంస్థ ఓ ఒఫ్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ సందర్బంగా ఇప్పాల మాత్రం అడ్రెస్ కనిపించలేదు.

సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ఇప్పాల… లోకేశ్ తో భేటీలో తనను ఎవరు గుర్తు పడతారులే అన్నట్లుగా వ్యవహరించారు. లోకేశ్ తో పదే పదే మాట కలిపేందుకు యత్నించారు. సిస్కో ఉన్నతాధికారులను తానే తీసుకువచ్చిన చందంగా కలరింగ్ ఇచ్చారు. ఈ దృశ్యాలు బయటకు వచ్చినంతనే టీడీపీ కేడర్ ఆయనను గుర్తు పట్టేశాయి. అప్పటికే లోకేశ్ కు కూడా ఆయనపై ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. సిస్కోతో భేటీ ముగియగానే… ఇప్పాల వ్యవహారంపై ఆ కంపెనీ హెచ్ఆర్ విభాగానికి ఓ ఫిర్యాదును ఈమెయిల్ చేసింది. దీంతో సిస్కో కూడా వెనువెంటనే ప్రతి స్పందించినట్లు సమాచారం. ఈ కారణంగానే.. తెలంగాణ సీఎంతో భేటీలో ఇప్పాల జాడ కనిపించలేదని తెలుస్తోంది.