టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి సెలవు రోజు ఆదివారం ఎంచక్కా ఆధ్మాత్మీక పర్యటనకు వెళ్లారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి ఉత్తర భారతం వెళ్లిన లోకేశ్… పంజాబ్ లోని సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అమృత్ సర్ లోని ఈ దేవాలయంలో భార్య, కుమారుడితో కలిసి ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన వివరాలను లోకేశే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అమృత్ సర్ లోని హర్ మందిర్ సాహిబ్ ను దర్శించుకున్నానని తెలిపిన లోకేశ్… తనకు దక్కిన అరుదైన అవకాశంగా ఈ ఆలయ దర్శనాన్ని భావిస్తున్నానని పేర్కొన్నారు. శాంతి సౌభ్రాతృత్వాలను ప్రసాదించాలని కోరుకున్నానని తెలిపారు. స్వర్ణ దేవాలయం ప్రాశస్త్యం నిజంగా అద్భుతమని, ఆలయ దర్శనం ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భార్య, కుమారుడితో కలిసి పూజలు చేస్తున్న, ఆయలంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఫొటోలను ఆయన షేర్ చేశారు.
మహాకుంభ మేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు కుటుంబంతో కలిసి నారా లోకేశ్ ఇటీవలే ప్రయాగ్ రాజ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం తన కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని లోకేశ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాలుపంచుకున్నారు. తిరుమల టూర్ లో లోకేశ్ ఫ్యామిలీతో పాటు ఆయన తల్లితండ్రి కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం చడీచప్పుడు లేకుండానే లోకేశ్ తెల్లవారే సరికంతా అమృత్ సర్ లో ప్రత్యక్షమయ్యారు. లోకేశ్ వెల్లడించే దాకా ఆయన అమృత్ సర్ వెళ్లిన విషయమే ఎవరికీ తెలియదని చెప్పాలి.