వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో నలుగురి పరిస్థితి ఎలా ఉన్నా.. మిగిలిన ఏడుగురు మాత్రం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా వారు సభకు రావాలని.. ప్రజల పక్షాన సభలో గళం వినిపించాలని భావిస్తున్న మాట వాస్తవం. అయితే.. దీనికి పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకు న్న నిర్ణయం.. గీసిన లక్ష్మణ రేఖ వంటివి వారికి ప్రతిబంధకంగా మారాయి. దీంతో వారు అటు సభకు వెళ్లాలో.. ఇటు అధినాయకుడి మాట వినాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సీనియర్లతో పాటు జూనియర్లు, తొలితరం వైసీపీనాయకులు కూడా ఎమ్మెల్యే లుగా విజయం దక్కించుకున్నారు. సహజంగా వీరిలో కొత్తవారికి సభకు రావాలనే ఉంది. తద్వారా.. వచ్చే ఎన్నికలకు తమ తమ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తు న్నారు. లేకపోతే.. రెంటికీ చెడ్డ రేవడిగా మారుతామని వారు భావిస్తున్నారు. కొత్త తరం ఎమ్మెల్యేలైతే.. అసలు అసెంబ్లీ తీరుపైనా వారు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
కానీ, ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధినేత.. అది ఇస్తే తప్ప.. తాము సభకు వచ్చేది లేదని చెబుతున్నారు. ఇది రాజకీయంగా ఆయనకు మేలు చేస్తుందా? చేయదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ఎమ్మెల్యేలుగా ఉన్న ఆరేగుడురు నాయకులు మాత్రం అంతర్మథనం చెందుతున్నారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలన్న విషయంపైనా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పది నెలలు గడిచిపోయిందని అంటున్నారు.
మరోవైపు.. సభకు సరిగా హాజరు కాకపోతే.. వేటు తప్పదన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడి హెచ్చరికలు కూడా .. వైసీపీ ఎమ్మెల్యేలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. అటు అధినేత జగన్, ఇటు స్పీకర్ అయ్యన్నల హెచ్చరికలు, ఆదేశాలతో వైసీపీ నూతన తరం ఎమ్మెల్యేలు తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలోనే దొంగ చాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు.. పార్టీ మారాలని ఎదురు చూస్తున్న ఇద్దరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు కూటమి నుంచి సరైన సంకేతాలు రావడం లేదని సమాచారం. దీంతో వారు త్రిశంకు స్వర్గంలో అల్లాడిపోతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట.