ఖలిస్తానీ గ్రూప్‌పై రాజ్‌నాథ్ గురి.. అమెరికా ఎలా స్పందిస్తుందో?

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికాను కోరడం గమనార్హం. ఇటీవల ఢిల్లీలో అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల్సి గబ్బార్డ్‌తో జరిగిన సమావేశంలో, SFJ సంస్థ భారత్‌కు వ్యతిరేకంగా అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆయన ప్రస్తావించారు. భారత భద్రతకు భంగం కలిగించే విధంగా ఈ సంస్థ ప్రచారం చేస్తోందని, అలాగే SFJ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నున్ పై ఉగ్రవాద చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కోరిన విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు.

ఈ చర్యల వెనుక ముఖ్య కారణం, 2023లో అమెరికా న్యాయ విభాగం నిఖిల్ గుప్తా అనే భారతీయ పౌరుడిపై SFJ అధినేత పన్నున్ హత్య కుట్ర కేసులో నేరపూరిత ఆరోపణలు మోపడం. దీనిపై భారత్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అయితే, ఈ కేసును అమెరికా భారత ప్రభుత్వంపై ఒత్తిడికి మార్గంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు, పన్నున్ అమెరికా, కెనడా పౌరసత్వాలు కలిగి ఉండటంతో, ఈ వ్యవహారం అంతర్జాతీయంగా భారత్‌కు సున్నితమైన రాజకీయ సమస్యగా మారింది.

అమెరికా ఈ డిమాండ్‌కు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటున్నప్పటికీ, కెనడాలో కూడా ఖలిస్తానీ మద్దతుదారులు ప్రభావం చూపిస్తుండటంతో, అమెరికా మౌనంగా వ్యవహరిస్తుందా లేదా భారత్ ఒత్తిడికి లోనై SFJపై కఠిన చర్యలు తీసుకుంటుందా? అన్నది చూడాలి. మరోవైపు, భారత్-అమెరికా మధ్య రక్షణ సంబంధాలు, ఇంటెలిజెన్స్ పంచుకోవడం వంటి అంశాల్లో ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

ఈ సమావేశం తర్వాత, రాజ్‌నాథ్ సింగ్ – తుల్సి గబ్బార్డ్ మధ్య రక్షణ, ఇంటెలిజెన్స్ సహకారం పెంపొందించే దిశగా చర్చలు జరిగాయి. దీనికి తోడు, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా గబ్బార్డ్‌తో భేటీ అయ్యారు. భారత్ ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతనిస్తూ, తన భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తోంది. కానీ, అమెరికా నిజంగా SFJపై కఠిన చర్యలకు ముందుకొస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.