ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 సీట్లకు ఐదుగురు అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెలాఖరుకు ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ సీట్లు… తాజా గణాంకాల ప్రకారం అధికార కూటమికే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ధర్మం పాటించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు 3 సీట్లను టీడీపీకి కేటాయించి… మిత్రపక్షాలు బీజేపీ, జనసేనలకు చెరో సీటును ఇచ్చారు. టీడీపీ, జనసేన అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కాగా… సోమవారం ఉదయం బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును కమల దళం తన అభ్యర్థిగా ప్రకటించింది.
వాస్తవానికి బీజేపీకి దక్కిన ఈ ఒక్క సీటు కోసం చాలా మంది తమ వంతు యత్నాలు చేశారు. సోము వీర్రాజుతో పాటుగా మరో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, తపన్ చౌధరి, పాకా సత్యనారాయణలు ఈ సీటు కోసం ముమ్మరంగా యత్నించారు. అయితే ఇప్పటికే ఓ దఫా ఎమ్మెల్సీలుగా వ్యవహరించిన నేపథ్యంలో వీర్రాజు, మాధవ్ ల అభ్యర్థిత్వాలను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పక్కన పెట్టినట్లుగా వార్తలు వినిపించాయి. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం యత్నించి… చివరి నిమిషంలో జాబితా నుంచి తప్పుకున్న తపన్ చౌధరికి అవకాశం కల్పిస్తే మంచిదన్న భావన వ్యక్తమైంది. అయితే శెట్టి బలిజల కోటాలో తనకూ అవకాశం కల్పించాల్సిందేనని పాకా సత్యనారాయణ పట్టుబట్టారట. దీంతో పంచాయతీ ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యవర్గం వద్దకు చేరింది.
ఆదివారం రాత్రి దీనిపై బీజేపీ పెద్దలు సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. అదే సమయంలో పార్టీకి చెందిన రాష్ట్ర నేతలతోనూ పలుమార్లు చర్చలు జరిపారు. తపన చౌధరి, పాకా సత్యనారాయణలు ఒకరికి ఒకరు తగ్గకపోవడంతో వారిద్దరి అభ్యర్థిత్వాలను పక్కనపెట్టిన అధిష్ఠానం… పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న వీర్రాజుకే మరోమారు అవకాశం కల్పిద్దామన్న భావనకు వచ్చింది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర శాఖ నేతలకు సమాచారం చేరవేసి… వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నాక… సోమావరం ఉదయం వీర్రాజు అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా… పొత్తులో భాగంగా టీడీపీ మద్దతులోనే వీర్రాజు ఓ దఫా ఎమ్మెల్సీగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే… జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగబాబు ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆదివారం సాయంత్రం టీడీపీ తన అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రలను ప్రకటించింది. వీరు ఇంకా నామినేషన్లు వేయాల్సి ఉంది. అదే సమయంలో సోమవారం అభ్యర్థిత్వం ఖరారు అయిన వీర్రాజు కూడా నామినేషన్ వేయాల్సి ఉంది. నామినేషన్ల దాఖలుకు సోమవారమే చివరి రోజు కావడంతో… అటు టీడీపీ అభ్యర్థులతో పాటుగా ఇటు బీజేపీ అభ్యర్థి వీర్రాజు కూడా సోమవారం నిర్ణీత వ్యవధిలోగానే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో సరిపడినంత బలం లేని కారణంగా వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో పోలింగ్ లేకుండానే.. ఈ ఐదుగురు ఎమ్మెల్సీలుగా ఎన్నిక కానున్నారు.