టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…మాజీ రాజ్యసభ ఎంపీ, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుల మధ్య రాజకీయపరంగా విభేదాలున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఈ తోడల్లుళ్లు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించి దాదాపు 30 సంవత్సరాలయింది. ఈ క్రమంలోనే తమ మధ్య ఉన్న గ్యాప్ పై దగ్గుబాటి వెంకటేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
అవునన్నా కాదన్నా..అందరికీ అన్ని విషయాలు తెలుసు. అవన్నీ గతం ఇక…వాటి గురించి అవసరం లేదు…మంచి జరగాలి…మంచిగా ఉండాలి..అందరితోటి బాగుండాలి..అందరూ బాగుండాలి…అని కోరుకుంటూ..ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు..మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ…ఎటువంటి భేషజాలు పెట్టుకోకూడదు అని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను…అని దగ్గుబాటు చేసిన వ్యాఖ్యలతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
అయితే, తన తోడల్లుడు దగ్గుబాటి చేసిన భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలకు చంద్రబాబు కూడా భావోద్వేగంతో స్పందించారు. దగ్గుబాటిని వేదికపైనే గట్టిగా ఆలింగనం చేసుకొని ఎమోషనల్ అయ్యారు. నేనున్నాను..గతం మరచిపోదాం అన్న రీతిలో దగ్గుబాటి వెన్నుతట్టి చంద్రబాబు భరోసానిచ్చారు. చంద్రబాబు, దగ్గుబాటి ఆలింగనం చేసుకోవడంతో సభికులంతా చప్పట్లు, కేరింతలతో తమ హర్షం వ్యక్తం చేశారు. గొప్ప వ్యక్తులు ఇలాగే ఉంటారని, గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ముందుకు సాగుతుంటారని, ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులను చూసి మనం కూడా జీవితంలో వీరిని ఫాలో కావాలని, అందరకీ మంచి జరగాలని కోరుకోవాలని వ్యాఖ్యాత అన్నారు. చంద్రబాబు, దగ్గుబాటిల ఎమోషనల్ రీ యూనియన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాస్తవానికి ఇటీవలి కాలంలో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గింది. నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలకు సంబంధించిన ఫంక్షన్లలో ఈ ఇద్దరు కలుసుకున్నప్పటికీ…బహిరంగ వేదికపై కలిసే సందర్భం రాలేదు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించడమే కాకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఇకపై తమ మధ్య ఎటువంటి పొరపొచ్ఛాలు ఉండబోవని చెప్పడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ చంద్రబాబు ఇంటికి వెళ్లి స్వయంగా వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. తన తోడల్లుడు పిలవడం…తాను రాకపోవడమా అంటూ చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నా కూడా కేవలం ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా నేడు విశాఖకు వచ్చారు. ఈ కార్యక్రమం తర్వాత మళ్లీ చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు.
పుస్తకావిష్కరణ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చరిత్రపై పుస్తకం రాసేందుకు ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందని వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేశానని తెలిపారు. ఈ పుస్తకం రచనకు ముందు చాలా కృషి చేశానని, ఎంబీబీఎస్ చదివిన తనకు సోషల్ స్టడీస్ పై అనుభవం, పరిజ్ఞానం అంతగా లేవని చెప్పారు. చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలని ఆలోచించానని, పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనేవాడిని అని చెప్పుకొచ్చారు. మహానుభావుల పాలనపై వివరాలను సేకరించానని, వారు చరిత్ర గతిని మార్చిన తీరును తెలుసుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం,వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు.