సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిజంగానే ఇప్పుడు భారీ ఊరట దక్కినట్టేనని చెప్పాలి. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట అప్పుడెప్పుడో వర్మ తీసిన సినిమాపై తాజాగా సీఐడీ నమోదు చేసిన కేసుపై ఏపీ హై కోర్ట్ స్టే విధించింది. ఈ పరిణామం వర్మకు బూస్టింగేనని చెప్పాలి. ఎందుకంటే.. ఈ కేసులో వర్మ వినిపించిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతేకాకుండా వర్మ వాదనను ప్రస్తావించిన కోర్టు సీఐడీ అధికారులపై అదే ప్రశ్నలను సంధించింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైస్సార్సీపీ విజయం సాధించగానే… అప్పటికే వైసీపీకి మద్దతుగా నిలిచిన వర్మ ఆపై టీడీపీని టార్గెట్ చేస్తూ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట ఓ సినిమా తీశారు. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం కాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరును ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’గా మర్చి విడుదల చేశారు. ఈ సినిమాపై నాడే పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. అయితే… అప్పుడు ఆ ఫిర్యాదును పోలీసులు అంతగా పట్టించుకోలేదు. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో విచారణకు రావాలంటూ వర్మకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వర్మ సీఐడీ కేసును హై కోర్టులో సవాలు చేశారు. ఎప్పుడో 2019లో చేసిన ఫిర్యాదుపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని ఆయన అందులో ప్రశ్నించారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన హై కోర్టు కేసుపై స్టే విధించింది. అంతేకాకుండా 2019లో ఫిర్యాదు వస్తే ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని కూడా కోర్టు సీఐడీ అధికారులను ప్రశ్నించింది. ఈ వ్యాఖ్య ద్వారా వర్మ వాదనలో న్యాయం ఉంది కదా అన్నట్టుగా కోర్టు అభిప్రాయపడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.