బ‌న‌క‌చ‌ర్ల నిర్మించి తీరుతాం.. కేంద్రానికి కూడా చెప్పా: చంద్ర‌బాబు

క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల‌లో కీల‌క సాగునీటి ప్రాజెక్టును నిర్మించి తీరుతామ‌ని.. దీనికి ఎవ‌రు అడ్డు ప‌డినా.. అది ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌కు విఘాత‌మేన‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు బుధ‌వారం పొద్దు పోయాక‌.. మీడియాతో మాట్లాడారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును ప్రారంభించ‌కుండానే.. ప్ర‌తిపాద‌న ద‌శ‌లో కొంద‌రు అడ్డు ప‌డుతున్నా ర‌ని.. దీనిపై కేంద్రానికి వివ‌రించామ‌ని చెప్పారు. గోదావ‌రి జిలాలు వృథాగా స‌ముద్రంలో క‌లుస్తున్నాయ‌ని.. వాటిని వినియోగించుకుని క‌రువు జిల్లాలను స‌స్య‌శ్యామ‌ల చేయాల‌న్న‌దే త‌మ అభిలాష అని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఏదైనా మంచి ప‌ని త‌ల‌పెడితే.. అడ్డు త‌గిలేవారు ఎక్కువ‌గా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇక‌, రాష్ట్రంలో నెల‌కొన్న రాజకీయ పరిణామాల గురించి హోంమంత్రి అమిత్ షాతో చర్చించాన‌ని చంద్ర‌బాబు తెలిపారు. భ‌విష్య త్తులో ఎన్డీయే ప్ర‌భుత్వం ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చించామన్నారు. ముఖ్యంగా.. రెండు కీల‌క బిల్లుల‌పై కేంద్ర మంత్రితో చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు గురించి వివ‌రించాన‌న్నారు. భూములకు సంబంధించి కంప్యూటరీకరణలో కొన్ని సమస్యలు వచ్చాయని, గత వైసీపీ హ‌యాంలో నాయకులు, అధికారులు కలిసిపోయారని విమ‌ర్శించారు. దీంతో ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని తెలిపారు. గతంలో అటవీ భూములు కూడా ఆక్రమించారని చెప్పారు.

మోడీ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో గుజ‌రాత్‌లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారన్న చంద్ర‌బాబు.. ఆ మోడ‌ల్‌ను అనుస‌రించ‌నున్న‌ట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఏపీ శాసనసభ, మండలి ముందుకు బిల్లు వచ్చిందన్నారు. దీనిని త్వరగా ఆమోదించాలని కోరిన‌ట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి సాగు, డ్రగ్స్ పెద్ద సమస్యగా ఉందన్న ఆయ‌న‌.. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు వ్యవస్థలు ఏర్పాటు చేశామ‌న్నారు. గంజాయి కట్టడి చేస్తే ఉపాధితో పాటు ప్రోత్సాహకాలు ఇస్తామ‌న్నారు. ఈ క్ర‌మంలో ఏపీలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకువస్తున్నామ‌న్నారు.రెండు బిల్లుల గురించి కేంద్రమంత్రులతో చర్చించామ‌న్నారు.

వైసీపీ విధ్వంసం..

గ‌త వైసీపీ హయాంలో పెద్దఎత్తున అధికార దుర్వినియోగం, ఆర్థిక నేరాలు జ‌రిగాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలు మిగిల్చారని అన్నారు. ప్ర‌స్తుతం రుణాలు తీసుకునే సామర్థ్యం ఏపీకి జీరోగా ఉందని నీతి ఆయోగ్ నివేదించిందన్నారు. జ‌గ‌న్ హ‌యాంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు కూడా దాటిపోయి అప్పులు తెచ్చార‌ని అన్నారు. కూట‌మికి 57 శాతం ఓటు బ్యాంకు, 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయన్నారు. మ‌రోసారి తాజాగా జ‌రిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికే పట్టం కట్టారని, వారి ఆకాంక్ష‌లు నెర‌వేరుస్తామ‌ని చెప్పారు.