ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ప్రవేశ పెట్టే తొలి పూర్తిస్థాయి బడ్జెట్పై చాలానే అంచనాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ ద్వారా ఏపీ ముఖ చిత్రం మారేందుకు, మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్ని స్తున్నారు. విజన్-2047తోపాటు.. వికసిత ఆంధ్రప్రదేశ్, పీ-4 లక్ష్యాలకు అనుగుణంగా.. తీర్చిదిద్దిన బడ్జెట్ రాష్ట్రాన్ని మరో 25 సంవత్సరాల పాటు అభివృద్దిలోపురోగమించేంలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకవైపు నిధుల కొరత వెంటాడుతున్నా… మరోవైపు అభివృద్ది మంత్రంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
ప్రధానంగా పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సంకల్పంతో కూటమిసర్కారు ముందుకు సాగుతోంది. తద్వారా.. ఎన్నికలకు ముందు చెప్పిన ఏటా 4 లక్షల ఉద్యోగాలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రానున్న ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కల్పించనుంది. దీంతో బడ్జెట్లో పెట్టుబడిదారులకు వరాలుకురవనున్నాయి. పెట్టుబడులతో వచ్చే వారికి ఏకగవాక్ష(సింగిల్ విండో) విధానంలో అనుమతులు ఇచ్చే ప్రతిపాదనను తీసుకువస్తున్నారు.
అదేవిధంగా ప్రజల జీవన శైలిని మరింత సులభతరం చేసేందుకు వీలుగా వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగు పరిచే చర్యలు తీసుకుంటారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 10వ తరగతి చదివిన వారికి సొంత కాళ్లపై నిలబడేలా శిక్షణ ఇవ్వనున్నా రు. తద్వారా నిరుద్యోగానికి చెక్ పెట్టనున్నారు. ఇక, పీ-4 విధానాన్ని అటుఅభివృద్ది, ఇటు సంక్షేమంలో నూ అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో రహదారులు, కాల్వల అభివృద్ధి శరవేగంగా జరగనుంది.
పేదలను గుర్తించి.. వారిని పైకి తీసుకువచ్చే బాధ్యతను ఉన్నతస్థాయి వర్గాలకు అప్పగించనున్నారు. దీంతో పేదరికంపైనా కూటమి ప్రభుత్వం విజయం దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా రు. ఇక, మెజారిటీ ఓటర్లు మహిళలే కాబట్టి.. వారిని ఆకర్షించేందుకు పెట్టుబడి సాయంతోపాటు.. అన్ని రంగాల్లోనూ వారిని ప్రోత్సహించే విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా.. మహిళా సాధికారతను మరింత పైస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తంగా బడ్జెట్తో ఏపీ ముఖ చిత్రం మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.