ఈ బడ్జెట్ తో అంతా మిగుల్చుడే!

ఏపీలో ఆదాయ, వ్యయాలు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. మునుపటి మాదిరిగా ప్రతి చిన్న దానికీ కోట్ల మేర ప్రజా ధనాన్ని తగలేయడం దాదాపుగా తగ్గిపోయింది. అవసరం ఉన్న వాటికి తప్పించి… ఆదా చేయొచ్చు అన్న ప్రతి చిన్న అంశంపైనా ప్రభుత్వం పొదుపు మంత్రాన్నే పఠిస్తోంది. గతంలో మాదిరిగా ప్రతి చిన్నదానికీ ఇబ్బడిముబ్బడిగా నిధులు వెచ్చించే పనికి అస్సలు అనుమతులు ఇవ్వడం లేదు. అవసరం ఉన్న ఏ చిన్న పని అయినా… పెద్ద పని అయినా అప్పటికప్పుడు అవసరమయ్యే పరిధిలోనే నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. ఇక ప్రత్యామ్నాయం ఉన్న వాటి విషయంలో అయితే నిధుల కేటాయింపు లేదు. వ్యయమూ ఉండటం లేదు. పలితంగా దుబారా అన్న మాటే వినిపించడం లేదు.

నేడు ఏపీలోని కూటమి ప్రభుత్వం తన తొలి వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ ఎలా ఉంటుంది? ఎంత మేర ఉంటుంది?.. ఏఏ రంగాలకు ఏ మేర కేటాయింపులు అనే దాని కంటే కూడా… ఈ బడ్జెట్ లో పొదుపుకు ఎంతమేర ప్రాధాన్యం ఇచ్చారు?.. అదే సమయంలో దుబారాకు ఏ మేర చెక్ పెట్టారన్నది ఇట్టే అర్థమయ్యేలా పయ్యావుల ఓ అద్భుతమైన మార్గాన్నిఎంచుకున్నారు. ఈ దఫా బడ్జెట్ సందర్భంగా లక్షల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి పుస్తకాలు ముద్రించే పనికి స్వస్తి చెప్పారు. అంతా ఆన్ లైన్ అన్నట్టుగా బడ్జెట్ పూర్తి పాఠాన్ని ఆన్ లైన్ లో పెట్టేయనున్నారు. సభ్యులకు కూడా బడ్జెట్ పూర్తి పాఠాన్ని పెన్ డ్రైవ్ లలో అందించనున్నారు. మీడియాకూ అదే పద్దతిన అందజేస్తారు. ఆర్థిక మంత్రి హోదాలో సభలో పయ్యావుల చేసే ప్రసంగం ప్రతులను మాత్రమే ముద్రించారు.ఈ లెక్కన బడ్జెట్ తోనే పయ్యావుల ఆదా మొదలుపెట్టేశారని చెప్పక తప్పదు.

గతంలో అయితే కేవలం సీఎం క్యాంపు కార్యాలయంలో వినియోగించే పెన్నులు, పేపర్ల కోసమే రూ.9.84 కోట్లను ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయి. తాడేపల్లిలో వైసీపీ అధినేత ఏర్పాటు చేసుకున్న సీఎం క్యాంపు కార్యాలయంలో వినియోగించే పెన్నులు, పేపర్ల కోసం ఐదేళ్ల కాలంలో ఈ మేర నిధులను వినియోగించినట్లుగా ఈ మధ్యే వెలుగు చూసింది. పాలన అంతా ఆన్ లైన్ అయిపోతున్నప్పుడు… ఈ మేర నిధులను పెన్నులు, పేపర్ల కోసం వినియోగించడం అంటే దుబారా కిందే లెక్క. కూటమి జమానాలో ఈ తరహా దుబారా ఇకపై ఉండబోదన్న భరోసాను ఆర్థిక మంత్రి పయ్యావుల తన బడ్జెట్ తోనే ఇచ్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.