నేతన్న కళాకృతి!.. వస్త్రంపై నారా ఫ్యామిలీ!

కుల వృత్తులకు మన సమాజంలో ఎనలేని గుర్తింపు ఉంది. ఒక్కో వృత్తిలో ఒక్కో రకమైన కళ దాగి ఉంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ కళలు అలా వినుతికెక్కుతూ ఉంటాయి. ఇలాంటి ఎప్పటికప్పుడు సరికొత్త కళాకృతులతో ఆకట్టుకుంటున్న వృత్తి చేనేత వృత్తి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి చేనేత కళకు కాణాచి. ఎన్నెన్నో కొత్త కళాకృతులు ఇక్కడి నేతన్న చేతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన… బుధవారం అలాంటి ఓ కళాకృతి ఒకటి వెలుగులోకి వచ్చింది.

మంగళగిరికి చెందిన చేనేత కార్మికుడు జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయలు టీడీపీ వీరాభిమానులు. తమ అభిమాన నాయకుడు తమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైనం వారిని మరింతగా ఆకట్టుకున్నట్టు ఉంది. తమ అభిమాన నాయకుడి మొత్తం కుటుంబాన్ని చేనేత వస్త్రంపై చిత్రీకరిస్తే ఎలా ఉంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా తండ్రీకొడుకులు… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ల చిత్రాలను ఓ ఫొటో మాదిరిగా వస్త్రంపై అచ్చేసినట్టుగా రూపొందించేశారు.

ఈ వస్త్రాన్ని తీసుకుని ఆ తండ్రీకొడుకులు బుధవారం లోకేశ్ ను కలిశారు. అభిమానం కొద్దీ తాము రూపొందించిన వస్త్రాన్ని వారు లోకేశ్ కు బహూకరించారు. ఆ వస్త్రాన్ని… దానిపై తన మొత్తం కుటుంబ సభ్యులను ఓ ఫొటో మాదిరిగా అచ్చేసినట్టుగా చేనేత వస్త్రాన్ని తీర్చిదిద్దిన వారిద్దరి పనితనాన్ని లోకేశ్ వేనోళ్ల కొనియాడారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో తమకు చేతనైన మేర సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామంటూ వారు లోకేశ్ కు తెలిపారట. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా…తన పార్టీ శ్రేణులు ఇలా సేవా కార్యక్రమాలు చేపడతానంటే ఎవరు మాత్రం కాదంటారు? అందుకే లోకేశ్ కూడా ఆ తండ్రీకొడుకులకు గో అహెడ్ అంటూ అభయం ఇచ్చారట.