టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. వంశీ మాదిరే వైసీపీ జమానాలో నోరు పారేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మరికొందరు నేతల అరెస్టులు తప్పవని చెబుతున్న టీడీపీ నేతలు…
అందుకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంత ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత, మచిలీపట్నం ఎమ్మెల్యే, కూటమి కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్న కొల్లు రవీంద్ర ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆదివారం నిర్వహిచిన ఓ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి పాల్గొన్న సందర్భంగా రవీంద్ర.. వంశీ అరెస్టుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గాలు చేసిన వారిని దేవుడు క్షమించవచ్చేమో గానీ. కర్మఫలం మాత్రం క్షమించదని ఆయన అన్నారు.
కాస్త వెనుకా ముందు కావచ్చు గానీ… కర్మఫలం దుర్మార్గులను కటకటాల పాలు చేయడం ఖాయమని ఆయన అన్నారు. కర్మఫలం సిద్ధాంతం ఆదారంగానే వంశీ అరెస్ట్ అయ్యారన్నారు. టీడీపీ టికెట్ పై సీఎం నారా చంద్రబాబునాయుడు పుణ్యాన ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ… దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపైనే దాడి చేయించారని, ఇప్పుడు దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారని ఆయన అన్నారు.
వంశీ బాటలోనే మరింత మంది నేతలు త్వరలోనే అరెస్టు కావడం ఖాయమని కూడా రవీంద్ర జోస్యం చెప్పారు. వైసీపీ జమానాలో బియ్యాన్ని అక్రమంగా నొక్కేసిన మాజీ మంత్రి పేర్ని నాని త్వరలోనే అరెస్టు కానున్నారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన పేర్నినానిని రైస్ పుల్లర్ అంటూ అభివర్ణిచారు. ఆ తర్వాత మరో మాజీ మంత్రి కొడాలి నాని వంతు అని తెలిపారు. కొడాలి అరెస్టుపై గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న రామునే చెప్పాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాస్త అటూఇటూ అయినా ముందు పేర్ని… ఆ తర్వాత కొడాలి అరెస్టు కాక తప్పదని రవీంద్ర చెప్పారు.