కేజ్రీ పై వర్మ గెలుపు.. కాబోయే సీఎం ఆయనేనా?

అరవింద్ కేజ్రీవాల్… దేశ రాజకీయాల్లో రీసౌండ్ ఇచ్చిన పేరిది. ఇటు అధికార బీజేపీతో పాటుగా అటూ నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దేశ రాజధానిలో ముచ్చెమటలు పట్టించిన నేతగా ఆయనకు పేరుంది. నాడు వరుసబెట్టి 15 ఏళ్ల పాటు ఢిల్లీ సీఎం సీటులో తిష్ట వేసిన కాంగ్రెస్ పార్టీని సింగల్ దెబ్బకు దించేసిన కేజ్రీ… పదేళ్ల పాటు బీజేపీకి ఆ సీటు దక్కకుండా చేసారు. ఇదంతా గతం అనుకుంటే… తాజా ఎన్నికల్లో కేజ్రీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు.

న్యూఢిల్లీ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన కేజ్రీ.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పర్వేశ్ వర్మ చేతిలో ఓడిపోయారు. కేజ్రీపై వర్మ ఏకంగా 1,200 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేజ్రీతో పాటుగా ఆయన హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన మనీష్ సిసోడియా కూడా ఓడిపోయారు. ఇక కేజ్రీ అరెస్ట్ తర్వాత సీఎం పీఠాన్ని అధిష్టించిన ఆతిశి చివరాఖరులో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే… కేజ్రిని ఓడించిన పర్వేశ్ వర్మ ఇప్పుడు ఢిల్లీ సీఎం రేసులో అందరికంటే ముందు ఉన్నారు. ఈ వర్మ… గతంలో బీజేపీ తరఫున ఢిల్లీ సీఎంగా పని చేసిన సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే. సాహిబీ సింగ్ వర్మ హయాం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటిదాకా గెలిచింది లేదు.

అయితే సీనియర్ వర్మ తర్వాత కొన్నాళ్ల పాటు దివంగత కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ బీజేపీ తరఫున ఢిల్లీ సీఎంగా వ్యవహరించారు. తాజాగా కేజ్రిని ఓడించిన పర్వేశ్ వర్మ ఇప్పుడు ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేస్తే… ఆయన రికార్డులకు ఎక్కడం ఖాయమే.