ఓటు బ్యాంకు పైనే నితీష్ కన్ను

తొందరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో ఓటుబ్యాంకుపైనే నితీష్ కుమార్ ప్రధానంగా కన్నేశారు. ఎన్డీఏ కూటమి తరపున జేడీయూ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బాధ్యతలు చూస్తున్న నితీష్ 30 స్ధానాలను ముస్లింలు, యాదవులకే కేటాయించటం సంచలనంగా మారింది. ముస్లింలు, యాదవుల ఓట్లు షేర్ రాష్ట్రంలో సుమారు 30 శాతం ఉంది. పొత్తుల్లో భాగంగా 243 అసెంబ్లీ సీట్లలో జేడీయూ 115 సీట్లలో పోటి చేస్తోంది. తమ వాటాగా వచ్చిన సీట్లలో 19 చోట్ల యాదవులకు, 11 చోట్ల ముస్లింలకు టికెట్లు ఇస్తున్నట్లు నితీష్ ప్రకటించారు.

దాదాపు మూడు దశాబ్దాలుగా ముస్లింలు, యాదవుల్లో మెజారిటి సెక్షన్లు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తోనే ఉన్నారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో కూడా పై వర్గాలకు ఆర్జేడీ మంచి ప్రాధాన్యతే ఇచ్చింది. 58 మంది యాదవులకు, 17 మంది ముస్లింలకు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ టికెట్లు ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు పార్టీలు కూడా యాదవులు, ముస్లింలకు ఏదో టికెట్లిచ్చాం అన్నట్లు కాకుండా బలమైన అభ్యర్ధులనే రంగంలోకి దింపుతున్నాయి.

ఎప్పుడైతే రెండు పార్టీల నుండి బలమైన అభ్యర్ధులు పోటిలోకి దిగుతున్నారో అప్పటి నుండే ఉద్రిక్తతలు మొదలైపోయాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 61 మంది యాదవ ఎంఎల్ఏలు గెలిచారు. వీరిలో 42 మంది ఆర్జేడీ నుండి విజయంసాధిస్తే మిగిలిన 11 మంది జేడీయూ నుండి గెలిచారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కలిసి ఓ కూటమిగా పోటి చేశాయి కాబట్టే అంతటి ఘన విజయం సాధ్యమైంది.

సరే ఎన్నికలన్నాక ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవటం, విమర్శలు సంధించటం మామూలే. కాబట్టి ఇపుడు కూడా నితీష్-తేజస్వీ యాదవ్ అదే పని చేస్తున్నారు. ఇక జేడీయూ భాగస్వమి పార్టీ బీజేపీ, ఆర్జేడీ భాగస్వమ్యమైన కాంగ్రెస్ కేవలం సహాయంగా మాత్రమే నిలుస్తున్నాయి. ఎందుకంటే ఏ కూటమి గెలిచినా నితీష్, తేజస్వీలను చూసి ఓట్లేయాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. పనిలో పనిగా వీళ్ళతో పాటు ఇంకా చాలా పార్టీలే రంగంలో ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా గెలుపు తమదే అని ధైర్యంగా ఏ కూటమి కూడా చెప్పలేకపోతోంది.