నెలకు లక్ష జీతమా.. అయితే పన్ను కట్టక్కర్లేద్దు

అంతా అనుకున్నట్లుగా మధ్య తరగతికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. శనివారం 2025-26 వార్షిక బడ్జెట్ ను నిర్మల ప్రశేశపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు భారీ కేటాయింపులు చేసిన ఆర్థిక మంత్రి… మధ్య తరగతికి భారీ ఊరట ఇచ్చేలా సంచలన ప్రకటన చేశారు. ఏ వర్గం వారికైనా రూ.4 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని విధంగా కొత్త నిర్ణయం తీసుకున్నారు.

ఇక నిర్మలమ్మ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన వేతన జీవులకు కూడా ఆమె గుడ్ న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఆదాయపన్ను విధించట్లేదని తెలిపారు. దీనికి అదనంగా లభించే స్టాండర్డ్ డిడక్షన్ ను కలుపుకుంటే.. రూ.75 వేల వరకు పన్ను మినహాయింపు పెగనుంది. అంటే… మొత్తంగా వేతన జీవులకు రూ.12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభించనుందన్న మాట. వాస్తవానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షల దాకా పెంచుతారని అంతా భావించారు. అయితే ఆ అంచనాకు మించి రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపును నిర్మలమ్మ ప్రకటించారు.

రూ.12 లక్సల వార్షిక ఆదాయాన్ని మించిన వేతన జీవులకు వారి ఆదాయం ఆదారంగా పలు రకాలుగా పన్ను శ్లాబులను నిర్మలమ్మ ప్రతిపాదించారు. రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఆదాయంపై 15 శతం పన్ను విధిస్తారు. రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఆదాయం ఉన్న వారిపై 20 శాతం పన్ను విధిస్తారు. రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆదాయంపై 25 శాాతం పన్నును విధిస్తారు. రూ.24 లక్షలకు మించిన వార్షిక ఆదాయంపై 30 శాతం పన్నును విధిస్తారు.

వేతన జీవులకు భారీ ఊరట ఇచ్చిన నిర్మలమ్మ… ఇతర వర్గాలపైనా వరాలు కురిపించారు. టీడీఎస్ పై వడ్డీ ఆదాయంపై ప్రస్తుతం ఉన్న రూ.50 వేల పరిమితిని రూ.1 లక్షకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇక అద్దె ద్వారా సీనియర్ సిటిజన్స్ పొందే ఆదాయంపై ప్రస్తుతం ఉన్న రూ.2.4 లక్షల పరిమితిని ఏకంగా రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు వృద్ధులకు ఎంతో ప్రయోజనం లభించనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర అంశాలు ఎలా ఉన్నా… వేతన జీవుల పన్నులు, టీడీఎస్, రెంట్ తదితర అంశాలపై నిర్మలమ్మ చేసిన ప్రకటనలపై హర్షం వ్యక్తమవుతోంది.