ఫైర్ బ్రాండుకు జగన్ షాక్

పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపుపొందిన నగిరి ఎంఎల్ఏ రోజాకు జగన్మోహన్ రెడ్డి షాకిచ్చారా ? తాజాగా ప్రభుత్వం భర్తీ చేసిన బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాన్ని చూస్తే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీలో రోజాకు బద్ధశతృవు అయిన కే. శాంతిని ఏరికోరి ఈడిగ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా నియమించారు. పైగా కార్పొరేషన్ కు క్యాబినెట్ ర్యాంకు ఉంటుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఒక్కసారిగా రోజా, శాంతి హోదా సమాన స్ధాయిగా మారిపోయింది. రోజా ఎంఎల్ఏనే అయినా ఏపిఐఐసీ ఛైర్మన్ గా అపాయింట్ అయిన తర్వాత క్యాబినెట్ మంత్రి ర్యాంకు దక్కింది. ఇపుడు శాంతికి కూడా ఛైర్మన్ హోదాలో క్యాబినెట్ మంత్రి ర్యాంకు వచ్చింది.

శాంతి గతంలో నగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా పనిచేశారు. ఈమెకన్నా ముందే ఈమె భర్త కేజే కుమార్ కూడా మున్సిపల్ ఛైర్మన్ చేశారు. వీళ్ళద్దరికీ నియోజకవర్గంలో గట్టిపట్టుంది. పైగా నియోజకవర్గంలో బీసీ, ఎస్సీల సామాజికవర్గాలే ఎక్కువ. ఈ సామాజికవర్గాల తర్వాతే క్షత్రియులుంటారు. ఇటువంటి కేజే దంపతులు ఒకపుడు రోజాకు బాగా సన్నిహితులు. ఎంఎల్ఏ కాకముందు రోజా నియోజకవర్గంలో పర్యటించటానికి వచ్చినపుడు రాత్రిపూట బస చేయాలంటే వీళ్ళింట్లోనే ఉండేవారు.

ఇంతటి సన్నిహితుల మధ్య ఎందుకు గొడవలు మొదలయ్యాయో ఎవరికీ తెలీదు. ఒకపుడు సన్నిహితుల ఇఫుడు ఉప్పునిప్పుగా మారిపోయారు. అప్పటి నుండి దంపతులిద్దరు రోజాను పూర్తిస్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో రోజా కూడా దంపతులను వీలైనంతగా తొక్కేసేందుకే ప్రయత్నిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇటువంటి నేపధ్యంలోనే దంపతులకు జిల్లాలోని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల అండ దొరికింది. నిజానికి వీళ్ళకు కూడా రోజాతో పడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

దాంతో రోజాతో సంబంధం లేకుండానే శాంతికి ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి దక్కిందని పార్టీలో ప్రచారం మొదలైపోయింది. ఎంఎల్ఏల సిఫారసు లేకుండా ఆ నియోజకవర్గంలోని వాళ్ళకు జగన్ కూడా ఎంటర్ టైన్ చేయటం లేదు. రోజాను అడిగితే శాంతికి పదవి ఇవ్వమని సిఫారసు చేసే అవకాశాలు లేవన్నది అందరికీ తెలిసిందే. అలాంటిది శాంతికి ఛైర్ పర్సన్ పదవి దక్కిందంటే రోజాకు షాక్ తగిలినట్లుగానే అనుకోవాలి. తెర వెనుక బలమైన లాబీయింగ్ రోజాకు వ్యతిరేకంగా పనిచేసిన కారణంగానే శాంతికి ఛైర్ పర్సన్ వచ్చిందనేది వాస్తవం. మరి ఈ విషయంలో రోజా ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.