చేతులు కలిపిన ప్రత్యర్ధులు..జగన్ లెక్క సెట్టవుతుందా ?

జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రత్యర్ధులిద్దరు చేతులు కలపటం బాగానే ఉంది. కానీ క్షేత్రస్ధాయిలో ఈ కలయిక వర్కవుటవుతుందా ? ఇదే ఇపుడు గన్నవరం నియోజవకర్గంలో అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. మొన్నటి జగన్ పర్యటన తర్వాత ప్రత్యర్ధులిద్దరు మళ్ళీ ఎక్కడా కలవలేదని సమాచారం.

మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు లేవదీశారు. తర్వాత పార్టీకి దూరమైపోయి వైసీపీకి దగ్గరయ్యారు. నియోజకవర్గంలో సమస్యంతా ఇక్కడే మొదలైంది. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇన్చార్జిగా వంశీపై ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావే చెలామణి అవుతున్నారు. ఈయన కాకుండా మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కూడా ఉన్నారు.

ఎప్పుడైతే వంశీ వైసీపీకి దగ్గరగా మెలుగుతున్నారో అప్పటి నుండే యార్లగడ్డకు సమస్యలు మొదలయ్యాయి. దాంతో నియోజకవర్గంలో పెత్తనం వంశీదా లేకపోతే యార్లగడ్డదా అనే సమస్య పెరిగిపోయింది. ఈ సమయంలోనే యార్లగడ్డను జగన్ తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. యార్లగడ్డకు జిల్లా సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్ పదవి ఇచ్చారు. దాంతో యార్లగడ్డ సైలెంట్ అయిపోవటంతో వంశీయే వైసిపి ఎంఎల్ఏగా చెలామణి అయ్యారు.

అయితే ఊహించని రీతిలో మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు యాక్టివ్ అయ్యారు. దాంతో మళ్ళీ వంశీ-దుట్టా వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంతలో ఏమయ్యిందో ఏమో మళ్ళీ యార్లగడ్డ కూడా వంశీకి వ్యతిరేకంగా రాజకీయాలు మొదలుపెట్టేశారు. దాంతో ఎంఎల్ఏకి ఇటు యార్లగడ్డ అటు దుట్టా వర్గాలతో సమస్యలు పెరిగిపోయాయి. వీళ్ళ ముగ్గురు వర్గాల మధ్య వివాదాలతో నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్లో అయోమయం పెరిగిపోయింది. ఈ సమయంలోనే జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరంకు సిఎ వచ్చారు. కార్యక్రమంలో హాజరైన వంశీ-యార్లగడ్డకు జగన్ దగ్గరుండి మరీ చేతులు కలిపారు. తర్వాత వంశీనే నియోజకవర్గం ఇన్చార్జిగా ప్రకటించటమే కాకుండా వంశీతో కలిసి పనిచేయాలని యార్లగడ్డ+దుట్టాకు అందరిముందు చెప్పారు.

జగన్ చేసిన సయోధ్యతో నేతలంతా ఒకటిగా పనిచేస్తారని అందరు అనుకున్నారు. అయితే జగన్ పర్యటన తర్వాత ఇదంత సులభం కాదనే విషయం అర్ధమైపోయింది. ఎందుకంటే వంశీ, యార్లగడ్డలు కలిసి పనిచేయాలంటే ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇప్పించినంత సులభం కాదు. ప్రాధమికంగా ఉన్న సమస్యేమిటంటే వంశీ, యార్లగడ్డకు ఒకరంటే ఒకరికి పడదు. మొదట్లో ఇద్దరు సన్నిహితులే అయినా తర్వాత ప్రత్యర్ధులైపోయారు. పైగా నియోజకవర్గంలోనే బలమైన మూడో నేత దుట్టా ఉండనే ఉన్నారు.

పైగా వంశీకి వ్యతిరేకంగా దుట్టా తన రాజకీయాన్ని మరింతగా స్పీడు చేయబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అంటే దుట్టాకు పరోక్షంగా యార్లగడ్డ సహకారం కూడా అందుతోందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే నిజమైతే నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం వంశీ కష్టమే. సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, లేదా ఉపఎన్నికలు వచ్చినా వంశీనే వైసీపీ అభ్యర్ధి జగన్ ప్రకటించటం వరకు ఓకేనే. కానీ అందుకు నేతలంతా అంగీకరించాలి కదా. ఒకవేళ నేతలంతా అంగీకరించకపోతే మాత్రం గొడవలు అవుతునే ఉంటాయి. నియోజకవర్గంలో ఎవరి కెపాసిటి ఏమిటో, పార్టీలో ఉండేదెవరో, వెళ్ళిపోయేదెవరో తేలిపోవాలంటే ఉపఎన్నికలు రావాల్సిందే.