నిర్మలమ్మ పోస్టు పీకేసేందుకు మోడీషాలు రెఢీ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు త్వరలో మార్పు తప్పదా? కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె ఫోర్టుపోలియాలో మార్పు రానుందా? ఆమెను ఆర్థిక మంత్రి పదవి నుంచి తప్పించి వేరే శాఖకు మారుస్తారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో నిర్మలమ్మకు ఇబ్బంది తప్పదంటున్నారు. కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న ఆమె.. ఆశించినట్లుగా పని చేస్తున్నా.. అందుకు తగ్గ ఫలితాలు రాకపోవటం.. కార్పొరేట్లు.. కీలక వర్గాలపైఆమె తన ప్రభావాన్ని చూపించలేకపోవటం కూడా కారణంగా చెబుతున్నారు.

సమర్థవంతంగా పని చేస్తున్నా.. ఆశించినంత ఫలితాలు రాకపోవటం.. మోడీ సర్కారుపై ఎవరైనా టార్గెట్ చేయాలన్నంతనే తొలుత ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించటం పరిపాటిగా మారింది. ప్రధానిగా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఆర్థిక పరిస్థితిని ఒక కొలిక్కి తీసుకురావటానికి పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ పెద్ద మార్పులు లేకపోవటంతో నిర్మలమ్మను పక్కకు పెట్టి.. ఆమెస్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

దీనికి తోడు ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలుకూడా కారణంగా చెబుతున్నారు. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాస్వాన్ మరణించటం.. ఆయన మంత్రిత్వ శాఖల్ని పీయూష్ గోయెల్ కు అప్పజెప్పటంతో పాటు.. రానున్న రోజుల్లో జరిగే పశ్చిమబెంగాల్..కేరళ ఎన్నికలకు తగ్గట్లు కేంద్ర కాబినెట్ ను సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

నిర్మలమ్మ స్థానంలో జ్యోతిరాదిత్య సింధియా.. సురేశ్ ప్రభుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ మార్పులన్ని కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే అని చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. వచ్చే నెల 10న బిహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాతే కేంద్ర కాబినెట్ లో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. వ్యూహాత్మకంగా పశ్చిమ బెంగాల్ కు పెద్దపీట వేయటం.. కేరళకు చెందన నేతలకు ప్రాధాన్యత పదవుల్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీకి ఎంతకూ కొరుకుడుపడని రాష్ట్రాల్లో ఆ రెండు కీలకమన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. ఆ రెండు రాష్ట్రాల వారికి పదవులు ఇవ్వటం ద్వారా.. అక్కడి వారి మనసుల్ని దోచుకోవాలన్న ఆలోచనలో ప్రధాని మోడీ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదన ఎంతమేర నిజం అన్నది తేలాలంటే కాలమే సరైన సమాధానం చెప్పగలదు.