ఆ 12వేల కోట్ల కోసమే సింఘాల్ బదిలీ?

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక బదిలీపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాత్రికి రాత్రే అనిల్ సింఘాల్ ను ఆరోగ్య శాఖ కార్యదర్శిగా బదిలీ చేయడం….వెంటనే సింఘాల్ స్థానంలోకి ఆరోగ్యశాఖ కార్యదర్శి జవహర్ రెడ్డిని నియమించడం…ఇవన్నీ చకచకా జరిగిపోవడంపై చర్చ నడుస్తోంది.

ఓ పక్క తిరుమల డిక్లరేషన్ వ్యవహారంపై చెలరేగిన వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది…మరోవైపు బ్రహ్మాత్సవాలలో పాల్గొన్న మంత్రుల సహా కొందరికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలోనే అనిల్ సింఘాల్ బదిలీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, అనిల్ సింఘాల్ బదిలీ వెనుక అసలు కారణం వేరే ఉందన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

2017లో అనిల్ సింఘాల్ ను నాటి బీజేపీ-టీడీపీ కూటమి కావాలని టీటీడీ ఈవోగా నియమించిందన్న టాక్ ఉంది. ఉత్తరాదికి చెందిన సింఘాల్ నియామకంపై ఆనాడే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కేంద్రంలో బీజేపీతో జగన్ సర్కార్ కూడా సింఘాల్ ను కొనసాగించింది. అయితే, అంతర్వేది ఘటన, టీటీడీ డిక్లరేషన్ వ్యవహారాల్లో వైసీపీ పై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో సింఘాల్ బదిలీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

అంతేకాకుండా, తిరుమలలోగుట్టు… బీజేపీ పెద్దలకు సింఘాల్ ద్వారానే తెలుస్తోందని పుకార్లు వచ్చాయి. ఇక, ముఖ్యంగా తిరుమల శ్రీవారికి కానుకలుగా వచ్చిన మొత్తం రూ.12000 కోట్లను ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చేందుకు సింఘాల్ సుముఖంగా లేరన్న వదంతులు వినిపిస్తున్నాయి.

ఆ మొత్తం డిపాజిట్ చేసిన జాతీయ బ్యాంకుల కన్నా 0.5 శాతం అధిక వడ్డీ చెల్లిస్తామని వైసీపీ సర్కార్ పెట్టిన ప్రతిపాదనకు సింఘాల్ నో చెప్పారట. టీటీడీ నిధులు ప్రభుత్వానికి అప్పుగా బదిలీ చేసుకోవడానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓకే చెప్పినా…. సింఘాల్ తీవ్రంగా వ్యతిరేకించారట. దీంతో, సింఘాల్ స్థానంలో జవహర్ రెడ్డిని నియమిస్తే అప్పు పుట్టడం సులువు అవుతుందని ఈ బదిలీకి వైసీపీ అధిష్టానం తెరతీసిందని ప్రచారం జరుగుతోంది. మరి, ఈ ప్రచారంలో వాస్తవం ఎంతుందో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.