తెలంగాణలోనూ పొలిటికల్ బాంబులు పేలతాయట

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాజకీయాలలో పొలిటికల్ బాంబుల ట్రెండ్ నడుస్తోంది. ఓ మీడియా ఛానల్ అధినేతపై పరోక్షంగా వైసీపీ చేసిన ట్వీట్ పెను దుమారం రేపుతోంది. ఇక వైసీపీకి దీటుగా ఈరోజు టీడీపీ కూడా సంచలన ట్వీట్ చేయబోతోంది. ఈ క్రమంలోనే ఈ ట్రూత్ బాంబుల కల్చర్ తెలంగాణకు పాకినట్లు కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, కాళేశ్వరం, ధరణి వంటి అంశాలపై చర్చలు ఉండొచ్చని పొంగులేటి చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశమయ్యాయి. పకడ్బందీగా అన్ని ఆధారాలతో ఫైల్స్ రెడీ చేశామని, ఒకటి రెండు రోజుల్లో ఏదో ఒక అంశంలో బాంబులు పేలుతాయని, అందులో బీఆర్ఎస్ కు చెందిన ప్రధాన నాయకులు ఉంటారని పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

మూసీ నది సుందరీకరణ నేపథ్యంలో సియోల్ లో పర్యటిస్తున్న పొంగులేటి అక్కడ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాము రెండ్రోజుల్లో హైదరాబాద్ వస్తామని, వచ్చిన తర్వాత పొలిటికల్ బాంబులు పేలుతాయని చెప్పారు. ధరణిని ప్రైవేట్ విదేశీ కంపెనీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించిందని, దాని వెనుక ఎవరున్నారు, లావాదేవీలు ఏం జరిగాయి అనే దానిపై కూపీ లాగుతున్నామని అన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పొంగులేటి వార్నింగ్ ఇచ్చారు.

ఇది కక్ష సాధింపు కాదని, పూర్తి ఆధారాలతోనే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని పొంగులేటి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా విచారణ పూర్తయిందని, ఇక, ఫోన్ టాపింగ్, ధరణి వంటి వ్యవహారాలు విచారణలో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలోని అక్రమాలపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని ప్రజలకు పొంగులేటి హామీ ఇచ్చారు.