సీఎం సర్పంచుల హక్కులు కాలరాస్తున్నాడు: చంద్రబాబు!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రాబాబు పర్యటన కొనసాగుతుంది. గురువారం చంద్రబాబు మండపేటలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సర్పంచుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు.

సీఎం జగన్ సర్పంచుల హక్కులను కాల రాస్తున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక సర్పంచుల ఆధ్వర్యంలోనే పంచాయతీల పనులు చేయిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. 25 వేల కిలోమీటర్లు రోడ్డు వేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని పేర్కొన్నారు చంద్రబాబు.

ఈ సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు తమ ఆవేదనను చంద్రబాబు ముందు వెలిబుచ్చారు. వైసీపీ నేతలు, వలంటీర్ల వల్ల తాము పడుతున్న బాధలను తెలుగు దేశం పార్టీ అధినేత దృష్టికి తీసుకొచ్చారు. రాజోలు, మలికిపురం మండలం కేశనపల్లి సర్పంచ్ తన ఆవేదనను బయటపెట్టారు. వాలంటీర్లు రాజ్యాంగేతర శక్తులుగా మారారన్నారు. సర్పంచులు చేస్తున్న ఉద్యమాన్ని జగన్ పట్టించుకోవటం లేదని కపిళేశ్వరపురం మండలం వల్లూరు మహిళా సర్పంచ్ ఆవేదన చెందారు.

వాలంటీర్ల వ్యవస్థ ఉగ్రవాదంలా మారిందని.. హక్కుల కోసం మాట్లాడితే వాలంటీర్లు భయపడుతున్నారని రాజోలు నియోజకవర్గం విశ్వేశ్వరపురం సర్పంచ్ చెల్లుబోయిన వేణి తెలిపారు. సర్పంచులను వైసీపీ నేతలు భయపెడుతున్నారని మలికిపురం మండలం దిండి సర్పంచ్ వాపోయారు. సైకో ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటికి పంపి పంచాయతీల హక్కులను కాపాడాలని కోరారు మండపేట నియోజకవర్గం కపిళేశ్వరపురం సర్పంచ్ చంద్రబాబును కోరారు.