ఆలియా సినిమా గాలి తీసేసిన హీరోయిన్

బాలీవుడ్ అగ్ర కథానాయిక ఆలియా భట్ నుంచి ఇటీవలే ‘జిగ్రా’ అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ చిత్రాన్ని హిందీతో పాటు వివిధ భాషల్లో రిలీజ్ చేశారు. సినిమాకు చాలా మంచి టాకే వచ్చింది. కాకపోతే లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం.. పైగా సెంటిమెంట్ టచ్ ఉన్న సీరియస్ మూవీ కావడంతో విడుదల ముంగిట అంతగా బజ్ రాలేదు.

అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా జరిగాయి. సినిమాకు టాక్ బాగున్నా వసూళ్లు అంచనాలకు తగ్గట్లు లేవనే వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్లో స్వయంగా నటి, దర్శకురాలు, నిర్మాత అయి ఉండి కూడా ఈ చిత్రాన్ని కించపరిచేలా దివ్య ఖోస్లా కుమార్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. ‘జిగ్రా’ సినిమాకు థియేటర్లలో జనం లేకపోయినా హౌస్ ఫుల్స్ అయినట్లు చూపిస్తున్నారని ఆమె ఎద్దేవా చేసింది.

‘‘జిగ్రా సినిమా చూద్దామని థియేటర్‌కు వెళ్లా.న హాలు మొత్తం ఖాళీగా ఉంది. చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాళ్లే టికెట్లు కొనుగోలు చేసి.. ఫేక్ కలెక్షన్లు అనౌన్స్ చేస్తున్నందుకు ఆలియా భట్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇదంతా తెలిసి కూడా పెయిడ్ మీడియా  సైలెంట్‌గా ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ప్రేక్షకులను వెర్రివాళ్లను చేయకూడదు’’ అని దివ్య ఖోస్లా కుమార్ పోస్ట్ పెట్టింది. స్వయంగా ఓ పెద్ద నిర్మాత భార్య అయి ఉండి ఒక సినిమాను డౌన్ చేసేలా దివ్య ఇలాంటి పోస్ట్ పెట్టడం షాకింగే.

ఆమె వ్యాఖ్యలపై కరణ్ జోహార్ పరోక్షంగా స్పందించాడు. ‘‘మూర్ఖులకు మనం ఇచ్చే అత్యుత్తమ సమాధానం మౌనమే’’ అని ఆయన పెట్టిన పోస్ట్ దివ్యను ఉద్దేశించిందిగానే భావిస్తున్నారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించడం మామూలే అని.. ‘జిగ్రా’ లాంటి మంచి సినిమాను దివ్య టార్గెట్ చేసి ఉండాల్సింది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు చిత్రాల్లో నటించిన దివ్య.. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. ఆమె రెండు చిత్రాలను డైరెక్ట్ చేసింది కూడా.