‘చావా’కు చెక్ పెట్టేందుకు పుష్ప ప్లాన్

స్పీడ్ బ్రేకర్స్ గా మారతాయనుకున్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవడంతో పుష్ప 2 ది రూల్ ఘనంగా రంగప్రవేశం చేసేందుకు రెడీ అవుతోంది. ముందు అనుకున్న డిసెంబర్ 6 కాకుండా ఒక రోజు ముందు గురువారం 5నే రావాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నట్టు వస్తున్న సమాచారం ట్రేడ్ వర్గాలకు కిక్ ఇస్తోంది. ముఖ్యంగా నార్త్ బయ్యర్లకు ఇది పెద్ద శుభవార్త. ఎందుకంటే ఆరో తేదీనే విక్కీ కౌశల్ ‘చావా’ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

ఇందులోనూ రష్మిక మందన్ననే హీరోయిన్. మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చావాకున్న నేపథ్యం వల్ల ఎక్కువ డిమాండ్ ఉంది. దీన్ని తట్టుకోవాలంటే పుష్ప 2 ఒక రోజు అడ్వాన్స్ గా థియేటర్లకు రావడం మంచి ఎత్తుగడ. టాక్ బయటికి వచ్చేస్తుంది. ప్రేక్షకుల తీర్పు అర్థమైపోతుంది. పాజిటివ్ ఉంటే మాత్రం చావా ఎలా ఉన్నా పుష్పకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఏ సమస్యా లేదు కానీ ఉత్తరాదిలో చావా పోటీ వల్ల చిక్కులుంటాయని నార్త్ డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడ్డారు.

ఇదంతా విశ్లేషించుకున్న పుష్ప 2 బృందం గురువారం విడుదలే సరైన నిర్ణయమనే నిర్ధారణకు వచ్చిందట. ప్రీమియర్లకు బదులు రోజంతా కలిపి అన్ని షోలు వేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గేమ్ చేంజర్ వాయిదా దాదాపు ఖరారు కావడంతో పుష్ప 2కి రూట్ మరింత క్లియర్ అయ్యింది. మూడు హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ మూవీ బేబీ జాన్ లు క్రిస్మస్ సందర్భంగా వస్తున్నప్పటికీ పుష్పకు టెన్షన్ లేదు.

ఒకవేళ రామ్ చరణ్ ఉంటే థియేటర్లు తగ్గేవి కానీ ఇప్పుడా బెడద లేదు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న పుష్ప 2 నవంబర్ మూడో వారంకల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఐటెం సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్స్ లో మిగిలిన వర్క్ మొత్తం పూర్తవుతోంది. ట్రైలర్ లాంచ్ ని దీపావళి పండగ కన్నా ముందే ప్లాన్ చేసే సూచనలున్నాయి.