ఆ సినిమా గురించి ముందే తెలుసు-కిరణ్ అబ్బవరం

‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ చిత్రంతో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన యువ కథానాయకుడు.. కిరణ్ అబ్బవరం. ఆ సినిమా సక్సెస్ అయి అతడికి వరుసగా అవకాశాలు తెచ్చిపెట్టింది. కానీ తర్వాత విరామం లేకుండా సినిమాలు చేశాడు కానీ.. అందులో సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ మినహా చిత్రాలు మినిమం ఇంపాక్ట్ చూపించలేదు.

సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ‘రూల్స్ రంజన్’ అయితే కిరణ్‌కు తీవ్ర విమర్శలే తెచ్చిపెట్టింది. ఐతే ఈ సినిమా బాగా లేదని, ఆడదని తనకు ముందే తెలుసని అంటున్నాడు కిరణ్. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనే తాను పరోక్షంగా ఆ విషయం చెప్పానని.. తాను గ్యాప్ తీసుకుని మంచి సినిమాతో వస్తానని ఆ రోజు ప్రామిస్ చేశానని.. అందుకు తగ్గట్లే ఇప్పుడు ‘క’ మూవీతో ప్రేక్షకులను మెప్పిస్తానని అతను ధీమా వ్యక్తం చేశాడు.

“నేనేదైతే కావాలనుకున్నానో అమ్మానాన్నలకి చేసేసి.. మిగతా ఏం చేసినా అభిమానుల కోసమే. నా ఫ్యాన్స్ అంటూ ఎవరున్నారో మీకోసమే. నా చివరి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా. ఆ సినిమా గురించి నాకు ముందే తెలుసు కాబట్టే ప్రి రిలీజ్ ఈవెంట్ రోజు అలా మాట్లాడాను. మీరు కావాలంటే ఆ ఈవెంట్ వీడియోలు చూసుకోండి. నేను ఒక సంవత్సరం టైం తీసుకుంటున్నట్లు చెప్పాను. నాకు ఈ తప్పులు తెలియక కాదు. అనుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేయడం వల్ల.. నేను ఆ తప్పులు సరిదిద్దుకోలేకపోయాను. నా లుక్ కూడా మార్చుకోకుండా సినిమాలు చేశాను.

నాకు బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్లో, డబ్బులు లేకపోవడం వల్లో.. నేను చేయాలనుకున్నది చేయలేకపోయాను. అందుకే ఒక సంవత్సరం టైం తీసుకున్నా. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు నా కొత్త సినిమాతో వస్తున్నా. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఈ సినిమాతో తెలుస్తుంది. నేను నా అభిమానులను ఎంతో గౌరవిస్తాను. అందరు హీరోలకూ అభిమానులు ఉంటారు. నేను బాగుండాలని, నా నుంచి మంచి సినిమాలు రావాలని కోరుకునే అభిమానులు చాలామందే ఉన్నారు. వాళ్ల కోసం మంచి సినిమాలు చేస్తాను. నేను వాళ్లకు మాత్రమే సమాధానం చెబుతాను” అని ఓ ఇంటర్వ్యూలో కిరణ్ అన్నాడు.