‘ఆగడు’ విషయంలో తప్పెక్కడ జరిగింది?

మహేష్ బాబు కెరీర్లో భారీ అంచనాల మధ్య విడుదలైన దారుణమైన ఫలితాన్ని అందుకున్న చిత్రాల్లో ‘ఆగడు’ ఒకటి. ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీను వైట్లతో మహేష్ బాబు చేసిన సినిమా కావడంతో దీనికి మామూలు హైప్ రాలేదు. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

మహేష్‌కు ‘దూకుడు’ లాంటి మెమొరబుల్ మూవీ ఇచ్చిన ఇచ్చిన దర్శకుడే ‘ఆగడు’ లాంటి మరిచిపోదగ్గ సినిమాను ఇవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ సినిమా దగ్గర్నుంచే శ్రీను వైట్ల కెరీర్ కూడా తిరగబడింది.

‘ఆగడు’ సినిమా చేయడం మిస్టేక్ అని మహేష్ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ఐతే ఇప్పుడు వైట్ల కూడా ఆ సినిమా విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన కొత్త చిత్రం ‘విశ్వం’ దసరా కానుకగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ‘ఆగడు’ను అతి పెద్ద ‘రిగ్రెట్’గా భావిస్తానని వైట్ల చెప్పాడు.

‘ఆగడు’కు సంబంధించి ప్రతి నిర్ణయం తాను తీసుకుందే అని.. అందుకే ఈ సినిమా విషయం లో తాను చాలా పశ్చాత్తాపం చెందుతానని వైట్ల తెలిపాడు. నిజానికి ఆ టైంలో మహేష్ బాబుతో చేయాలనుకున్న కథ వేరని.. కానీ దాన్ని పక్కన పెట్టి ‘ఆగడు’ చేశామని వైట్ల వెల్డడించాడు.

ఇందుకు కారణాలను కూడా ఆయన వివరించాడు. ‘‘మహేష్ బాబుతో దూకుడు తర్వాత మళ్లీ చేసే సినిమా అంటే చాలా పెద్ద స్థాయిలో ఉండాలనుకున్నాను. అందుకే ఓ పెద్ద స్పాన్ ఉన్న కథను తయారు చేశాను. అది మహేష్‌కు వినిపిస్తే చాలా ఎగ్జైట్ అయ్యాడు.

ఐతే ఆ సమయానికి ‘ఆగడు’ నిర్మాతలైన నా స్నేహితుల పరిస్థితి అంత బాగా లేదు. వాళ్లు ఆ సినిమాకు అంత భారీ ఖర్చు పెట్టే స్థితిలో లేరు. దీంతో నేనే అంత పెద్ద కథ వద్దనుకుని విలేజ్ సెటప్‌లో తక్కువ బడ్జెట్లో అయ్యే సినిమా చేద్దామనుకుని ‘ఆగడు’ ట్రై చేశాం.

కానీ అది తేడా కొట్టింది. ప్రొడక్షన్, బడ్జెట్ గురించి ఆలోచించకుండా ముందు అనుకున్న కథే చేయాల్సిందనిపించింది. ఇది నేను ‘ఆగడు’ నుంచి నేర్చుకున్న పాఠం. ఐతే మహేష్‌తో అప్పుడు తీద్దామనుకుని పక్కన పెట్టిన కథ ఇప్పుడు చేయడం కుదరదు. అది అప్పుడే చేసి ఉండాల్సిన కథ’’ అని వైట్ల తెలిపాడు.