అభిమానుల కోసం అఖిల్ శపథం

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేళ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన పది పాత ఏఎన్ఆర్ క్లాసిక్స్ ని ఉచితంగా కొన్ని మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లలో చూసే అవకాశం కలిగించడంతో రీ రిలీజ్ పరంగా మరో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టినట్టయ్యింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్, పలు థియేటర్లలో జరుగుతున్న వేడుకల్లో నాగార్జున, నాగ చైతన్య హాజరయ్యారు. అయితే అఖిల్ ఎక్కడ కనిపించకపోవడం ఫ్యాన్స్ ని అసంతృప్తికి గురి చేసింది. ఇదే విషయాన్ని నేరుగా తండ్రి నాగ్ నే అడిగితే షాకిచ్చే సమాధానం వచ్చింది.

హిట్టు కొట్టే దాకా అఖిల్ తన అభిమానుల ముందుకు రానని చెప్పేశాడట. సాధారణంగా ఇలాంటి శపధాలు స్టార్ హీరోలు చేయడం అరుదు. కెరీర్ మొదలుపెట్టి ఇన్నేళ్లయినా అఖిల్ కు సక్సెస్ లేకపోవడం నిజమే. ఏజెంట్ అయితే మరీ దారుణంగా దెబ్బేసింది. అక్కినేని మూడో తరం వారసుడిగా బలమైన లెగసిని కొనసాగిస్తాడనుకుంటే ఇలా జరగడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో కథలు, కాంబోల ఎంపికలో జరుగుతున్న తప్పులు గుర్తించి అఖిల్ సైలెంటయ్యాడు. కొత్త ప్యాన్ ఇండియా మూవీ కోసం తన అవతారాన్ని పూర్తిగా మార్చుకుని ఏడాది నుంచి వెయిటింగ్ లో ఉన్నాడు.

ప్రస్తుతం అఖిల్ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. యూవీ సంస్థ అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించబోయే ఫాంటసీ మూవీ మొదటిది కాగా మరొకటి వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీకిశోర్ అబ్బూరుతో స్వంత బ్యానర్ లో ప్లాన్ చేసుకున్నది. వీటిలో ఏది ముందు మొదలయ్యేది ఇంకా బయటికి రాలేదు. ఇవి కాకుండా మరో ఇద్దరు దర్శకుల దగ్గర కథలు విన్న అఖిల్ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. శపథం సంగతి ఎలా ఉన్నా అఖిల్ వీలైనంత త్వరగా సినిమాలు మొదలుపెట్టి కెరీర్ లో గ్యాప్ లేకుండా చూసుకోవడం అవసరం. అన్న చైతుతో పోటీ పడుతూ వేగం పెంచాల్సిందే.