ఇస్మార్ట్ దర్శకుడి అడుగులు ఎటువైపు

డబుల్ ఇస్మార్ట్ పరాభవం దర్శకుడు పూరి జగన్నాధ్ దారులను పూర్తిగా మూసేసింది. ఒకవేళ మొదటి భాగం లాగా హిట్టయ్యుంటే ఎవరైనా మిడ్ రేంజ్ హీరో అవకాశం ఇచ్చేవాడేమో కానీ ఇప్పుడా ఛాన్స్ కనుచూపు మేర కనిపించడం లేదు. నిజానికి లైగర్ చేసిన గాయం, నష్టం రెండూ డబుల్ ఇస్మార్ట్ ని తీవ్రంగా వెంటాడాయి. సక్సెస్ అయితే మళ్ళీ రికవర్ అవ్వొచ్చన్న నమ్మకంతో కొందరు పెద్దలు తెరవెనుక సెటిల్ మెంట్లు చేయిస్తే ముందు నిలబడి పంపిణి హక్కులను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుక్కుని పూరి బ్రాండ్ మీద మార్కెటింగ్ చేశారు. తీరా చూస్తే లైగర్ కన్నా పెద్ద పరాభవం దక్కింది.

అసలు లైగర్ స్థానంలో ముందు అనుకున్న జనగణమన చేసినా పూరి ట్రాక్ రికార్డు ఇవాళ వేరుగా ఉండేదేమో. విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే జంటగా మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో దేశభక్తి అంశాన్ని ఎంచుకున్న పూరి దగ్గర దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికీ సిద్ధంగా ఉందట. అయితే బడ్జెట్ కారణమో మరేమైనా జరిగిందేమో కానీ దాని స్థానంలో లైగర్ తీయాలని నిర్ణయించుకోవడం దారుణంగా దెబ్బేసింది. సరే ఫ్లాపులు ఎవరికి లేవు, ఏదో ఒక స్టేజిలో అందరూ చూసినవే కదా అనుకుంటే డబుల్ ఇస్మార్ట్ అలా ఆలోచించే స్కోప్ కూడా ఇవ్వలేదు. తేజ సజ్జకు స్టోరీ చెప్పాడనే టాక్ ఉంది కానీ అదేమీ లేదట.

కొడుకు ఆకాష్ పూరి చేస్తున్న తల్వార్ లో పూరి జగన్నాథ్ పూర్తి స్థాయి నటుడిగా తెరంగేట్రం చేయబోతున్నాడని వినికిడి. చిరంజీవి గాడ్ ఫాదర్ లో కాసేపు కనిపించిన పూరి తనవరకు మైనస్ అనిపించుకోలేదు. ఆ ఉద్దేశంతోనే తల్వార్ దర్శకుడు పూరికో వేషం ఇచ్చారని అంటున్నారు. చూస్తుంటే ఎస్వి కృష్ణారెడ్డి, బి గోపాల్, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు తరహాలో పూరి డైరెక్టర్ గా రిటైర్మెంట్ తీసుకున్నారాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వీళ్లంతా లేటు వయసులో విశ్రాంతి తీసుకున్నవాళ్ళు. కానీ పూరికి ఇంకా బోలెడు వయసు, టాలెంట్ ఉండగానే అలాంటి నిర్ణయం తీసుకోకూడదు.