సూర్య కార్తీ మిస్సయిన రాజమౌళి మూవీ

కొన్ని కాంబోలు అనుకోగానే అయిపోవు. దానికి రాసిపెట్టి ఉండాలి. అన్నం గింజ మీద తినేవాడి పేరు ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. అలాంటి ఒక అరుదైన విశేషాన్ని కార్తీ ఇటీవలే పంచుకున్నాడు. సెప్టెంబర్ 28 విడుదల కాబోతున్న సత్యం సుందరం ప్రమోషన్లలో భాగంగా గౌతమ్ మీనన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు కలిసి నటించడం లేదనే దాని గురించి కొంత సేపు మాట్లాడాడు. రోలెక్స్, ఖైదీలు కలిస్తే తెరమీద ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారనే దానికి ఏకీభవిస్తూ ఒక ముచ్చట చెప్పాడు.

చాలా ఏళ్ళ క్రితం సూర్య, కార్తీ కాంబినేషన్ లో రాజమౌళి ఒక కథ చెప్పారు. వినగానే బాగుందనిపించినా ఎందుకో కార్యరూపం దాల్చలేకపోయింది. పేరేంటో చెప్పలేదు కానీ దాదాపుగా ఆది ఆర్ఆర్ఆర్ అయ్యుంటుందని చెప్పొచ్చు. కానీ ఆ బ్రదర్స్ కి కనెక్ట్ కాకపోవడానికి కారణం ఉండొచ్చు. తమిళ ప్రేక్షకులకు అంతగా అవగాహన లేని అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో కనిపిస్తే కోలీవుడ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోరనే సందేహం వచ్చి ఉండొచ్చు. దాంతో ఈ ప్రాజెక్ట్ ప్రాధమిక దశలో ఆగిపోయిందేమో. కార్తీ ఇంత డీటెయిల్డ్ గా చెప్పలేదు కానీ క్లూస్ ని బట్టి చూస్తే ఇదే అనుకోవచ్చు.

ఎంత స్టార్లైనా ఒకే ఇంటి నుంచి వచ్చిన అన్నదమ్ముల మల్టీస్టారర్లు తీయడం అంత సులభం కాదు. క్యామియోలు పక్కనపెడితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసిన ఇప్పటిదాకా స్క్రీన్ పంచుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబోని ఎవరూ రాయలేదు. నాగచైతన్య, అఖిల్ తెరపై కలయిక ఇప్పట్లో జరగదేమో. బాబాయ్ అబ్బాయి వెంకటేష్, రానాలు ఫుల్ లెన్త్ మూవీ చేయలేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ కాబట్టి పరిగణనలోకి రాదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉదాహరణలు వస్తూనే ఉంటాయి. పైన చెప్పింది నిజమే అయితే ఆర్ఆర్ఆర్ వద్దనుకోవడం వల్లే తారక్, చరణ్ కాంబో మనం చూడగలిగాం.