తెలంగాణలో సరిపోయింది.. ఏపీలో సరిపోలా

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’ విడుదల ముంగిట మంచి హైపే తెచ్చుకుంది. ఆ హైప్‌కు తగ్గట్లుగా సినిమా ఉండి, బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉంటే దీని లెక్కే వేరుగా ఉండేది. నాని మిడ్ రేంజ్‌ను దాటి కొత్త లీగ్‌లోకి వెళ్లిపోయేవాడనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ‘సరిపోదా శనివారం’ ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినా సరే సినిమాకు తొలి రోజు మంచి ఓపెనింగ్సే వచ్చాయి.

కానీ తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు సినిమాను గట్టి దెబ్బే తీశాయి. ఉన్నంతలో బాగానే వసూళ్లు వచ్చినా.. వర్షం వేసిన డెంట్ మాత్రం ఓవరాల్ కలెక్షన్ల మీద ప్రభావం చూపింది. బయ్యర్లను నిరాశకు గురి చేసింది.

‘సరిపోదా శనివారం’ థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు వచ్చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తెలంగాణలో మాత్రమే సేఫ్ అయింది కానీ.. ఏపీలో మాత్రం బయ్యర్లకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే నష్టాలు వచ్చాయి.

‘సరిపోదా శనివారం’ చిత్రానికి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ మార్కు రూ.45 కోట్లు. ఐతే ఇప్పటిదాకా రూ.40 కోట్ల మేర షేర్ వచ్చింది. ఐదు కోట్లు లాస్ అంటే పెద్ద విషయం కాదనుకోవాలి. కానీ ప్రతి ఏరియాలో కొంత కొంత నష్టం వస్తే ఓకే. కానీ యుఎస్‌లో ఈ సినిమా బయ్యర్‌కు పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయాన్ని అందించింది.

నైజాంలో ఈ సినిమాను రిలీజ్ చేసిన దిల్ రాజు సరిగ్గా పెట్టుబడిని వెనక్కి తెచ్చుకున్నాడు. కానీ ఏపీలో మాత్రం ప్రతి ఏరియాలో నష్టాలు తప్పలేదు. ఆంధ్ర ప్రాంతంలో 12 కోట్లు వెనక్కి రావాల్సి ఉంటే.. ఇప్పటిదాకా ఏడున్నర కోట్ల మేర షేర్ వచ్చిందంతే.

రాయలసీమలో ఆరున్నర కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ మార్కు కాగా.. మూడున్నర కోట్ల మేర వసూలైందంతే. దీంతో ఏపీ అంతటా అక్కడ బయ్యర్లు లబోదిబో అనే పరిస్థితి. మంచి లాభాలందించే సినిమా అవుతుందని ఆశిస్తే.. డివైడ్ టాక్, వర్షాల కారణంగా చివరికి ఏపీ వరకు ‘సరిపోదా శనివారం’ లాస్ వెంచర్‌గా మిగిలింది.